వైసిపి మైండ్ గేమ్ ఆడుతోందా ? చంద్రబాబు, లోకేష్ లకు భయం పట్టుకుందా?
ఏపీలో అధికార వైసిపి తీసుకుంటున్న నిర్ణయాలతో,వైసీపీ నేతలు చేస్తున్న మాటల దాడితో టిడిపి సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. వైసీపీ నేతలు ప్రతి వ్యవహారాన్ని తిప్పి తిప్పి టీడీపీకే చుట్టడం, తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్టు వారిలో వారికే అపనమ్మకం,అభద్రతా భావం కలిగించటం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారుతోంది.
ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!
టీడీపీ నేతల పరిస్థితికి చంద్రబాబు, లోకేష్ కారణం అంటూ మైండ్ గేమ్
ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కీలకనేతలు సైలెంట్ కాగా, కొందరు ముఖ్య నేతలు వైసిపికి మద్దతుగా,పార్టీకి దూరంగా పని చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీని నమ్ముకుని అధికారంలో లేని ఈ సమయంలో పార్టీ కోసం పని చేస్తున్న వారిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది వైసిపి. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులపై గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతికి సంబంధించి విచారణ కొనసాగిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తుంటే, మరోపక్క టీడీపీ ముఖ్య నాయకుల కష్టాలకు టిడిపిలో నేతలే కారణం అని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపి నాయకుల్లో కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. పార్టీలో అంతర్గత మథనానికి సంకేతంగా మారాయి.
టీడీపీ నేతలు మంచివారే ..బాబు , లోకేష్ లే మంచివారు కాదట !!
టీడీపీ ముఖ్య నాయకులను టార్గెట్ చేసి, వారిని రకరకాల కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పడుతున్న టిడిపి నాయకులు అందరు మంచివారిని, సానుభూతి చూపించటం వారు చంద్రబాబు,లోకేష్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ నేతలు టిడిపి నాయకుల పట్ల ఉదార స్వభావాన్ని చూపిస్తున్న పరిస్థితి అధినేత చంద్రబాబుకు,లోకేష్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.ఎక్కడ ఎవరు ఎలా మారతారో అనే అభద్రతా భావంలోకి చంద్రబాబుని, లోకేష్ ను నెడుతున్నారు.
టీడీపీ నాయకులపై లోకేష్ కుట్రలు చేస్తున్నారంటూ మైండ్ గేమ్
ఇక మొన్నటికి మొన్న టీడీపీ అధ్యక్ష పదవికి గత ఎన్నికల్లో ఓడిపోయారు అని సాకు చూపి కళావెంకట్రావు ను తొలగించి రామ్మోహన్ నాయుడుకు ముళ్ళ కిరీటం పెట్టాలని, యువనేతను బలిపీఠం ఎక్కించాలని లోకేష్ కుట్రలు చేస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు టిడిపి వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్న టిడిపి నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు ఆలోచించేలా చేస్తున్నాయి. కళా వెంకట్రావును టిడిపికి దూరం చేయాలనే ఆలోచనతో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. వైసీపీ ఈ తరహా మైండ్ గేమ్ కు తెర తీయడం మరింత ఇబ్బందిగా మారింది.
అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారితే ఆయన్ను వదిలేస్తామని సలహా
ఇక నిన్నటికి నిన్న టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో కూడా ఈ తరహా మైండ్ గేమ్ కు తెరతీసింది వైసిపి. అచ్చెన్నాయుడు అమాయకుడని, దీని వెనుక ఉన్న పందికొక్కులు చంద్రబాబు నాయుడు, లోకేష్ లే అని విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని పందికొక్కుల్లా చంద్రబాబు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేసి, అసలు ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడికి 5 కోట్లు ఇచ్చి ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడు మంచోడే అంటున్న వైసీపీ నేతల సానుభూతి
అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారి ఈఎస్ఐ కుంభకోణం వెనుక ఉన్నవారి పేరు చెప్తే ఆ పందికొక్కులను పట్టుకుంటామని కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం, అచ్చెన్నాయుడు మంచోడే, చంద్రబాబు, లోకేష్ లే దీనంతటికీ కారణమని చెప్పడం అని అర్థమవుతోంది. చంద్రబాబుకు లోకేష్ కు టిడిపి నేతలను దూరం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అచ్చెన్నాయుడు వ్యవహారంలోనూ లోకేష్ పై బాంబు పేల్చిన వైసీపీ
ఇక తాజాగా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా టిడిపి మీద బాంబు పేల్చాడు. అసలు అచ్చెన్నాయుడు నాడు మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సు లెటర్ ఇచ్చినట్లుగా కీలక డాక్యుమెంట్లను లీక్ చేసింది నారా లోకేష్ అండ్ టీమ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .చిట్టి నాయుడు దెబ్బ, అచ్చెన్నాయుడు అబ్బా అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు .టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తుందని 900 కోట్ల మందుల కుంభకోణంలో కీలక డాక్యుమెంట్లను లీక్ చేసింది చిట్టి నాయుడు టీం అంటూ షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
టీడీపీ నేతల్లో అనుమానాలు, అభద్రతా భావం
అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించడం, వాటాలు పంచుకోవడం, అడ్డంగా తిని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించడం ఇది చిట్టి నాయుడు గ్యాంగ్ కు అలవాటే అని చేసిన పోస్టు తో పెద్ద దుమారమే రేపారు. ఇక ఇందులో లోకేష్ పాత్ర ఉందని చెప్పడం ద్వారా టిడిపి నేతల్లో కొత్త అనుమానాలకు ఆజ్యం పోశారు. ఒకపక్క టిడిపి నేతలపై వరుస కేసులు, విచారణతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న చంద్రబాబుకు, వైసిపి ఆడుతున్న మైండ్ గేమ్ తో పార్టీలో అంతర్గతంగా పలు అనుమానాలు, భయాలు నెలకొన్న పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
Recommended Video
టీడీపీపై అన్ని వైపుల నుండి వైసీపీ దాడి .. మైండ్ గేమ్ తో మరింత ఇబ్బంది
ఒక వైపు నుంచి నాటి పరిపాలన చేసిన సమయంలో జరిగిన అవినీతిపై విచారణలు,మరో వైపు నుండి టిడిపి నుండి నేతలను దూరం చేసే ఆపరేషన్ ఆకర్ష్ , ఇంకొక వైపు నుండి తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు టిడిపి నేతలకు పలు అనుమానాలను క్రియేట్ చేస్తూ వైసిపి నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ చంద్రబాబుకు ఊపిరాడనివ్వడం లేదు. తాజా పరిణామాలు, వైసీపీ నేతలు చేస్తున్న హెచ్చరికలు భవిష్యత్తులో టిడిపి ఇంకెంత ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న భావన కలిగిస్తున్నాయి.ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలపై నోరెత్తకుండా అన్ని వైపుల నుండి పార్టీని బలహీనం చేయడానికి వైసిపి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం నిర్వివాదాంశం.