రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత
ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ ఇప్పుడు వలసలతో ఇబ్బంది పడుతుంది . ఒకపక్క రాష్ట్రంలో వైసీపీ , కేంద్రంలో బీజేపీ చంద్రబాబును ఏకాకిని చేసి దాడి చేస్తుంది. ఒకపక్క ఏపీలో చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చి వేస్తున్న జగన్ సర్కార్ టీడీపీని టెన్షన్ పెడుతుంటే మరో పక్క టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకోవటం తో పాటు టీడీపీపై సంచలన ఆరోపణలు చేస్తూ బీజేపీ సైతం దాడికి దిగుతుంది.
ప్రజావేదిక విషయంలో జగన్ చెప్పిందొకటి .. అధికారులు చేసిందొకటి.. వ్యూహమా .. టెన్షనా
ఇక తాజాగా రెండేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దేవధర్ షాకింగ్ కామెంట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఆయన మంగళవారం నాడు పామర్రులో పర్యటించారు. ఇక ఈనేపధ్యంలో ఆయన చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. కేంద్ర సర్కార్ ఏపీ అభివృద్ది కోసం నిధులు కేటాయించినా చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందన్నారు. ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప మాదిరిగా తయారయ్యాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబును ఉపేక్షించడం తగదన్నారు. తన రాజకీయ వారసుడిగా చంద్రబాబునాయుడు లోకేష్ను ప్రకటించడం దారుణం అని ఆయన పేర్కొన్నారు . కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ఇచ్చిన హమీని ఆయన నెరవేర్చుకోవాలని గుర్తు చేశారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వివిధ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు గుప్పించారు . రాబోయే రెండేళ్లలో అతను ఖచ్చితంగా జైలులోనే ఉంటాడని ఆయన పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం తమ పార్టీ నాయకులకు భద్రతను తగ్గిస్తోందని టిడిపి దళాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు . 2024 ఎన్నికలలో టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చాలా నమ్మకంగా ఉన్నారని కానీ అది సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.