కాపీకి చంద్రబాబు: కేజ్రీవాల్తో కలిసి జెపి పని?
హైదరాబాద్: అవినీతి ప్రధాన ఎజెండాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలోనే కాకుండా ప్రజలకు వాగ్దానాలు చేసే విషయంలో కూడా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అనుకరించాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
ఢిల్లీలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తూ జన్ లోక్పాల్ బిల్లు కోసం డిమాండ్ చేసినప్పటి నుంచి చంద్రబాబు అవినీతి వ్యతిరేకతను తన రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు అనతి కాలంలోనే ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్ హామీలను ఆయన సొంతం చేసుకునే ప్రయత్నాలు సాగించారు.
ఇందులో భాగంగానే కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్ధానాల్లో హామీ ఇచ్చినట్లు ఉచిత నీటి మంత్రాన్నే చంద్రబాబు కూడా వల్లిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో సురక్షితమైన మంచినీటిని అందరికీ అందిస్తామని, అది కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది కానీ మంచినీళ్లు మాత్రం దొరకడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి అరవింద్ కేజ్రీవాల్ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
ఇదిలావుంటే, లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అవినీతి వ్యతిరేకత ఎజెండాగానే రాజకీయాల్లోకి వచ్చారు. పారదర్శకత, అవినీతి రాహిత్యం అనేవి ఆయన ప్రధాన అంశాలుగా చేసుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ ఒక్కరు మాత్రమే గెలిచారు. అయితే, ఆయన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి పనికి వచ్చారనే విశ్షేషణ ఒక్కటి ముందుకు వచ్చింది.
ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేయడానికి ఉత్సుకత చూపుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ విషయంపై జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
జయప్రకాష్ నారాయణ శనివారం కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. భారతదేశంలో అన్ని చోట్లా అందరం విఫలమయ్యామని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేజ్రీవాల్తో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, కేజ్రీవాల్ మాత్రం తాము పొత్తులకు సిద్ధంగా లేమని చెప్పారు. రెండు పార్టీల మధ్య విస్తృతమైన చర్చలు అవసరమని ఆయన అన్నారు. మరోసారి సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఈ నెల 16వ తేదీన మళ్లీ సమావేశమవుతామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరమని తమ పార్టీ చెప్పిందని ఆయన అన్నారు. స్పష్టమైన విధానాలను తమ పార్టీ చెబుతుందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలవారు సంతృప్తి చెందే విధంగా ప్రతిపాదనలు చేస్తామని ఆయన చెప్పారు. లోకసత్తా తమ పార్టీలో విలీనమవుతుందో లేదో జెపినే అడగాలని కేజ్రీవాల్ అన్నారు.
విలీనానికి కేజ్రీవాల్ పట్టు?
లోకసత్తాను ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని కేజ్రీవాల్ అడుగుతున్నట్లు సమాచారం. ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని కేజ్రీవాల్ అంటూ లోకసత్తా తమ పార్టీలో విలీనమవుతుందో లేదో జెపిని అడగాలని అన్నారు. జెపి మాత్రం విలీనం చేయడానికి బదులు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లు అర్థమవుతోంది.