లాస్ట్ ర్యాంక్తో బిత్తరపోయిన నారాయణ: ఫోన్ చేసి బుజ్జగించిన బాబు
హైదరాబాద్: చివరి ర్యాంక్తో బిత్తరపోయిన మంత్రి నారాయణను సముదాయించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. ఫోన్ చేసి మరీ ర్యాంకులను పట్టించుకోవద్దని ఆయన చెప్పినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సర్వే మంత్రుల్లో గుబులు పుట్టిస్తోంది. ర్యాంకుల ఆధారంగా తమ జాతకాలు మారిపోతాయేమోననే దిగులు వారిని పట్టుకుంది. వైయస్సార్ కాంగ్రెసు నుంచి టిడిపిలోకి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడానికి ఈ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకుని ఉద్వాసన పలికే ప్రమాదాన్ని కూడా వారు ఊహిస్తున్నారు.
తమ పనితీరుపై తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలతో కొంతమంది మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. కొంత మంది అలకపాన్పు కూడా ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు చివరి ర్యాంకు వచ్చినట్లు మీడియాలో వార్తలు గుప్పుమనడంతో నారాయణ తీవ్రమైన అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. దీంతో మంగళవారం ఉదయాన్నే ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మంత్రి నారాయణకు ఫోన్ చేశారు.
ఆ సమయంలో నారాయణ వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పరిశీలనలో ఉన్నారు. ర్యాంకుల గురించి పట్టించుకోవద్దని, ర్యాంకులను ఇచ్చే విషయంలో పార్టీ వర్గాలు సరైన ప్రాతిపదికను ఎంచుకోలేదని, ఇండికేటర్స్ కూడా సరిగ్గా లేవని చంద్రబాబు నారాయణతో చెప్పినట్లు సమాచారం.
తాను కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ఈ ర్యాంకులు చూసి బయటకు ఇవ్వవద్దని ఆదేశించానిని, మీడియాకు ఎలా లీకయ్యాయో కూడా విచారణ జరుపుతున్నామని చంద్రబాబు నారాయణను బుజ్జగించినట్లు తెలుస్తోంది. తాను పట్టించుకోవటంలేదని, ఒకవేళ చివరి ర్యాంకు వచ్చినా సవాల్గా తీసుకొని మరలా పనిచేస్తానని నారాయణ చంద్రబాబుతో అన్నట్లు చెబుతున్నారు.