ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?: చంద్రబాబుపై దెబ్బ మీద దెబ్బ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నోటుకు ఓటు కేసు ఓ మలుపు తీసుకుంటుందోననే ఉత్కంఠ ఓ వైపు కొనసాగుతుండగానే చంద్రబాబును ఒకదాని వెనక ఒక సమస్య చుట్టుముడుతోంది. ఓటుకు నోటు కేసు చిక్కుల నుంచి బయటపడక ముందే అత్యంత తీవ్రమైన ఆరోపణ ఆయనపై వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందనే వికీలీక్స్ కథనం ఆయనను వివాదంలోకి నెట్టింది. ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నే తన వాదనకు ఆలంబనగా చంద్రబాబు తెచ్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఎపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై సిట్ విచారణకు కూడా ఆదేశించింది. ఈ స్థితిలో చంద్రబాబును అదే సమస్య చుట్టుముట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు, కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై తన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ దాడి చేశారనే వివాదం ఆయనకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. చింతమనేనిని కాపాడేందుకు చంద్రబాబు వనజాక్షిని తప్పు పట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వనజాక్షి వ్యవహారంతో ఎపి ఉద్యోగుల్లో నైతిక స్థయిర్యం దెబ్బ తినే వాతావరణం ఏర్పడిందని అంటున్నారు.
దానికితోడు, విజయవాడలో తన తాత్కాలిక నివాసం కోసం ఎంపిక చేసుకున్న భవనం అక్రమ నిర్మాణమనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో హైదరాబాదులో తన నివాసం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తుందనే వాదన ఉంది. నిబంధనల మేరకు నిర్మాణం జరగడం లేదంటూ జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుందనేది పెద్ద సమస్యగా మారింది. రాజధాని నిర్మాణంపైనే చంద్రబాబు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. త్వరలో శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. నిజానికి, అది భారీ ప్రాజెక్టు. ఆ భారీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులను ఎలా సమీకరిస్తారనేది కూడా చంద్రబాబుకు సమస్యగానే మారింది.
ఇవన్నీ ఇలా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం నిత్యం కయ్యాలు జరుగుతూనే ఉన్నాయి. జల వివాదాలు తీవ్రమవపుతున్నాయి. పట్టిసీమపై ఓ వైపు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుమ్మెత్తి పోస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం దాన్ని తప్పు పడుతోంది. కృష్ణా జలాలపై తెలంగాణతో ఇబ్బందులు తప్పేట్లు లేవు.
ప్రత్యేక హోదా ఉండనే ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారనే విమర్శ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో స్నేహం బెడిసి కొట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు బహుశా, చంద్రబాబు వద్ద సమాధానాలు లేవు. అందుకే, పవన్ కళ్యాణ్ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. వీటన్నింటికి తోడు, రాష్ట్రానికి పెద్ద యెత్తున నిధుల కొరత ఉంది. ఏది చేయాలన్నా నిధుల కొరత వెంటాడే పరిస్థితి. ఈ సమస్యలను చంద్రబాబు ఎలా పరిష్కరించుకుంటారనేది భవిష్యత్తు మాత్రమే తేలుస్తుంది.