లోకేష్కు ప్రమోషన్: బాబు అప్పగించనున్న ఆ కొత్త బాధ్యతలేంటి?
రాయలసీమలోని రెండు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు, కోస్తాంధ్రలో మూడు జిల్లాల బాధ్యతలను లోకేష్ కు అప్పగించేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం.
విజయవాడ: రాజకీయంగా నారా లోకేష్ కొంత పరిణితిని కనబరుస్తుండడం పట్ల ఆయన తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఉన్నారట. ఓవైపు పార్టీ బాధ్యతలను, మరోవైపు ప్రభుత్వ బాధ్యతలను ఇన్నాళ్లుగా భుజానికెత్తుకున్న చంద్రబాబు.. ఇకనుంచి పార్టీ బాధ్యతలను మెల్లిమెల్లిగా లోకేష్కు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
జాతీయ కార్యదర్శి పదవి అప్పగించడం ద్వారా.. పార్టీలో లోకేష్ను క్రియాశీలకంగా మార్చిన చంద్రబాబు.. పార్టీ కార్యాచరణ విషయాల్లోను లోకేష్ను ముందుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టు లోకేష్ కూడా ఈమధ్య జనచైతన్య యాత్రల్లో బాగానే ఆకట్టుకుంటుండడంతో.. పార్టీకి సంబంధించి మరిన్ని బాధ్యతలను లోకేష్ కే అప్పగించాలని భావిస్తున్నారట లోకేష్.
మునుపటితో పోలిస్తే.. ప్రసంగాల్లో కాస్తంత పరిణితితో వ్యవహరించడం.. పార్టీ కార్యకర్తలను కలుపుకోవడం వంటి విషయాల్లో లోకేష్ పనితనం పట్ల చంద్రబాబు సంతృప్తితో ఉన్నారట. అందుకే రాష్ట్రంలోని చాలా జిల్లాల బాధ్యతను లోకేష్ కు అప్పగించే పనిలో చంద్రబాబు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. రాయలసీమలోని రెండు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు, కోస్తాంధ్రలో మూడు జిల్లాల బాధ్యతలను లోకేష్ కు అప్పగించేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం.
లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ మరింత బలోపేతంగా తయారయ్యే అవకాశం ఉందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. అదీగాక ఈ వయసులో అటు పార్టీ బాధ్యతలను, ఇటు ప్రభుత్వ వ్యవహారాలను తానొక్కడే పర్యవేక్షించడం కన్నా.. లోకేష్ ను యాక్టివ్ చేయడం ద్వారా.. లోకేష్ భవిష్యత్తు రాజకీయాలను పటిష్టపరచడంతో పాటు రాజకీయంగా తనపై ఉన్న ఒత్తిడి కూడా కొద్దిమేర తగ్గుతుందనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతోంది.
మొత్తానికి లోకేష్ పై భరోసాతో పార్టీ బాధ్యతలకు సంబంధించి ఆయనకు ప్రమోషన్ అప్పగించే పనిలో పడ్డారు చంద్రబాబు. అయితే లోకేష్ కు బాధ్యతలు అప్పగించబోయే ఆ ఎనిమిది జిల్లాలు ఏవనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.