మంత్రులు, అధికారుల కంటే మందుబాబులు బెటర్: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మద్యం దుకాణాల్లో మందుబాబులు ఆన్ లైన్ చెల్లింపులు చేసి మరీ కొంటున్నారని, అలాగే అధికారులు కనీసం 20 శాతం మంది డిజిటల్ చెల్లింపులకు మారకపోవడం ఏమిటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
అమరావతి: రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రులు ఎక్కువ మంది ఆన్ లైన్ చెల్లింపుల వైపు మారకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. గురువారం ఆయన వివిద శాఖాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందు తాగేవారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారని, మంత్రులు, అధికారులు ఇంకా మారటం లేదని అభిప్రాయపడ్డారు.
చిన్న వ్యాపారుల ఇబ్బందులు
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుతో చిన్న చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్ లైన్ చెల్లింపులు పెరిగాయని ఆయన అన్నారు. కానీ ఇతర చోట్ల మాత్రం పెరగకపోవడం ఏమిటన్నారు.
మద్యం షాపుల్లో ఆన్ లైన్ చెల్లింపులు పెరిగాయి
మద్యం దుకాణాల్లో మందుబాబులు మాత్రం ఆన్ లైన్ చెల్లింపులు చేసి మరీ కొంటున్నారని చెప్పారు. నోట్ల రద్దుతో ఇబ్బందుల వల్ల ప్రజలు ప్రయాణాలు, పనులు మానుకుంటున్నారని చెప్పారు.
20 శాతం మంది అధికారులు ఆన్ లైన్ వైపు మారలేదా?
ఈ సందర్భంగా అధికారులు ఎంతమంది ఆన్ లైన్ చెల్లింపుల వైపు మళ్లారని ప్రశ్నించారు. కనీసం ఇరవై శాతం మంది రాష్ట్ర స్థాయి అధికారులు ఆన్ లైన్ చెల్లింపుల వైపు మళ్లకపోతే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ రంగంలో ఉత్తమ స్థానంలో..
ఆయన ఇంకా మాట్లాడుతూ.. అర్ధ సంవత్సరంలో రాష్ట్రం 12.23 శాతం వృద్ధి సాధించడం సంతోషకరమన్నారు. దేశంలోను, ప్రపంచంలోను రాష్ట్ర బెంచ్ మార్కును చేరుకోవాలన్నారు.కొన్ని విభాగాలు మాత్రమే అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. విద్యుత్ రంగంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచామన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10వేల ఆదాయం ఆర్జించేలా కృషి చేయాలన్నారు. పౌర సేవలలోను మేటిగా ఉండాలన్నారు.