తెలంగాణతో ఫైట్, సుప్రీం కోర్టుకైనా..: మోడీ ప్రభుత్వ తీరుపై బాబు అసహనం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లో కేంద్రం తీరుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. విభజన చట్టం అమలు, కేంద్రం హామీలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లో కేంద్రం తీరుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. విభజన చట్టం అమలు, కేంద్రం హామీలపై చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానికతపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. 2017 జూన్ 1తో ముగిసే స్థానికతను మరో రెండేళ్లు పొడిగించాలని లేఖలో కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా 2017 జూన్ 2వ తేదీలోపు ఏ రాష్ట్రంలో స్థానికత ఉన్నవారిని, ఆ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తిస్తామని కేంద్రం ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సమీక్షించారు.
కేంద్రమంత్రులతో మాట్లాడుతాం
అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రులతో మన మంత్రుల కమిటీ చర్చిస్తుందని కాల్వ చెప్పారు.విభజన చట్టంలో హక్కులను సాధించుకుంటామన్నారు. కేంద్రం నిర్ణయం అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
సుప్రీం కోర్టుకు వెళ్తాం
జరగబోయే నష్టాలను వివరిస్తామన్నారు. సానుకూల నిర్ణయాలు రాకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఏపీ స్థానికతపై సెక్షన్ 108ని మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు.
ఇబ్బంది వస్తే ఊరుకోం
ఆస్తుల పంపిణీపై జాప్యంపై ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖ రాశామని చెప్పారు. విభజన చట్టం అమలులో ఇబ్బందులు వస్తే తాము ఊరుకోమని అభిప్రాయపడ్డారు.
9వ షెడ్యూల్లో ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని చెప్పారు. ఏపీ స్థానికతపై కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు.
విభజన చట్టం ప్రకారం మావి మాకు
విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన హక్కులు, ఆస్తులు కావాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే అత్యున్నత స్థానంకు వెళ్తామని, అవసరమైతే రాష్ట్రపతి జోక్యం కోరుతామన్నారు.