బీజేపీతో తెంచుకుందామా?: అడగనున్న బాబు, 'కేంద్రం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు'
అమరావతి: బడ్జెట్కు ఏపీలో సరైన కేటాయింపులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆయన శుక్రవారం తొలుత పార్టీ సమన్వయ కమిటీ భేటీలో నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
Recommended Video
బీజేపీతో తేల్చేయాలని బాబుపై ఊగిపోయిన టీడీపీ నేతలు, ఎంపీలు, ఆదివారం కీలకభేటీ
ఆ తర్వాత మధ్యాహ్నం మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆదివారం ఎంపీలతో భేటీ కానున్నారు. బడ్జెట్ అనంతరం ఏపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని భావిస్తున్నారు. ఆదివారం ఎంపీలతో కీలక భేటీ అనంతరం ఏ నిర్ణయానికి రావొచ్చునని అంటున్నారు. బీజేపీతో కలిసి ఉందామా లేక అనూహ్య నిర్ణయం తీసుకుందామా అని టీడీపీ నేతలను అడిగి ఆయన ఓ నిర్ణయానికి రానున్నారు.
నేతల అభిప్రాయం తీసుకోనున్న చంద్రబాబు
చంద్రబాబు శుక్రవారం సమన్వయ కమిటీలో నేతలు, మంత్రివర్గంలో మంత్రులు, ఆదివారం ఎంపీల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. బీజేపీ వైఖరి ఇలాగే ఉంటే నష్టమని ఎక్కువ మంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అందరి అభిప్రాయాలు తీసుకొని అధినేత ముందుకు వెళ్లనున్నారు. ఇంకా ఓపిక పడితే అసలుకే మోసమని చాలామంది నేతలు చంద్రబాబుకు చెబుతున్నారు.
మిత్రధర్మం పాటించాం కానీ
గురువారం నేతలతోను చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా ఎంతో సహనంతో వేచి చూశామని, అన్ని విధాలా సహకరించామని, మిత్రధర్మం పాటించామని, అయినా చిన్నచూపే ఎదురయిందని పార్టీ ఎంపీలతో మాట్లాడినప్పుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని సరిదిద్దేలా అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
తొందరపాటు నిర్ణయాలు
విభజన జరిగిన మొదటి సంవత్సరంలో ఉన్న సమస్యలే కొనసాగుతున్నాయని, అరకొర చర్యలు, కంటితుడుపు కేటాయింపుతో సమస్య పరిష్కారం కాదని, మనం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలను, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో సబర్బన్ రైలు ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇస్తూ విశాఖ, విజయవాడ మెట్రోలను ప్రస్తావించలేదన్నారు. ఆ సమయంలో కొందరు ఎంపీలు.. ఆదేశిస్తే తాము రాజీనామా చేస్తామని చెప్పారు. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దని, కేంద్రంపై అన్ని విధాలా ఒత్తిడి తెద్దామని చెప్పారు.
అడిగిన దానికి, ఇచ్చిన దానికి పొంతన లేదు
కేంద్రం తీరుపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఆదివారం జరిగే ప్రత్యేక భేటీ తర్వాత తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. పోలవరం నుంచి అమరావతి వరకు అన్యాయం జరిగిందన్నారు. అడిగిన దానికి, ఇచ్చిన దానికి పొంతన లేదన్నారు. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టామన్నారు. నాలుగేళ్లు సమయమిచ్చినా న్యాయం చేయకుంటే ఎలా అన్నారు.
అసలు కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందే అర్థం కావట్లేదు
ఏపీ కోసం చంద్రబాబు చాలాసార్లు ఢిల్లీలో మంత్రులు, ప్రధాని చుట్టు తిరిగారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు వరకు సరైన నిర్ణయం తీసుకోకుంటే ప్రజలు ఏ రకంగా నిరాశపడతారో మనం చూస్తున్నామన్నారు. అవసరమైతే తాము రాజీనామాకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. అసలు కేంద్రం ఏం నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదన్నారు.