అఖిలప్రియ వర్గీయులే.. ఆధారాలు, ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడిపై బాబు సీరియస్
అమరావతి/ఆళ్లగడ్డ: మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరుపై అధిష్టానం దృష్టి సారించింది. ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు చేస్తున్న సైకిల్ ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. దీనిని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు వారి వారి అనుచరులతో నిర్వహించారు. అయితే ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై రాళ్ల దాడి జరిగింది.
మాకు నరేంద్ర మోడీ ఎంత?: టీడీపీ, ప్రధానిపై అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు
అధిష్టానానికి ఫిర్యాదు
తనపై జరిగిన రాళ్ల దాడికి మంత్రి భూమా అఖిలప్రియనే బాధ్యత వహించాలని ఏవీ సుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. తమపై దాడికి పాల్పడింది అఖిల వర్గీయులేనని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు అధిష్టానికి కూడా ఫిర్యాదు చేశారు.
పార్టీ కార్యక్రమంపై దాడులా?
అఖిలప్రియ - ఏవీ సుబ్బారెడ్డి మధ్య రాజీ కుదిర్చేందుకు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ అవి ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఏకంగా పార్టీ చేపట్టిన కార్యక్రమంపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడం పట్ల అధిష్టానం ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.
ఆధారాలు, చంద్రబాబు సీరియస్
తమపై దాడికి పాల్పడింది అఖిలప్రియ వర్గీయులే అని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. దీంతో పార్టీలో గ్రూపులు, అదీ పార్టీ కార్యక్రమంపై రాళ్లతో దాడి నేపథ్యంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది.
రేపు అమరావతి రండి
ఎన్నిసార్లు చెప్పినా అఖిల, ఏవీల మధ్య ఆధిపత్య గొడవలు తగ్గకపోవడంతో మంగళవారం అమరావతికి రావాలని ఇద్దరికి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి నుంచి చంద్రబాబు విడివిడిగా వివరణ తీసుకోవడంతో పాటు, ఇరువురికి క్లాస్ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడిని మాత్రం ఆయన చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు.