మళ్ళీ చంద్రబాబు విశాఖ టూర్: టీడీపీ,వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో వైజాగ్ లో హీట్
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభసగా మారి రాజకీయ దుమారానికి కారణమైంది. టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది . విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతల తీరుతో టీడీపీ నేతలు కూడా బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ పై, తాజా పరిణామాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఆగామో అక్కడ నుండే మళ్ళీ యాత్ర మొదలు పెట్టలని టీడీపీ నేతలు చాలా పట్టుదలతో ఉన్నారు.
మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు వ్యూహం
చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు దగ్గర జరిగిన హైడ్రామాతో వేడెక్కిన విశాఖ నగరం మరోసారి హాట్ హాట్ చర్చకు కారణం అవుతుంది. కావాలని వైసీపీ శ్రేణులు చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకున్నారని, చంద్రబాబు గో బ్యాక్ నినాదాలు వైసీపీ శ్రేణులే చేశారని భావిస్తున్న టీడీపీ మరోసారి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభించింది. అదే సమయంలో చంద్రబాబు మరోసారి వస్తే ఏం చేయాలన్నదానిపై వైసీపీ నేతలు సైతం వ్యూహాలు రచిస్తున్నారు.
విశాఖ పర్యటనలో చంద్రబాబుకు భంగపాటు..
ఫిబ్రవరి 27న చంద్రబాబు విశాఖ పర్యటనలో ఎయిర్పోర్టు ఆవరణలోనే భంగపాటు ఎదురైంది.చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. చంద్రబాబును అడ్డుకున్నది వైసీపీ శ్రేణులని, పులివెందుల గూండాలని, కడప రౌడీలని టీడీపీ నేతలు వాదిస్తుంటే వైసీపీ వైజాగ్ రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబును అక్కడ ప్రజలే అడ్డుకున్నారని చెప్తున్నారు.
వైసీపీ దాడులపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు
ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఇక కోర్టుకు కూడా వెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు మరోసారి వైజాగ్ పర్యటన చేసి తీరతారని లోకేష్ ప్రకటించారు . చంద్రబాబు విశాఖ పర్యటన జరిపి తీరాలని, ఆ పర్యటన సక్సెస్ చెయ్యాలని ఈసారి టీడీపీ నేతలు పక్కా వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.
రోడ్డు మార్గంలో బాబు విశాఖ పర్యటనకు ప్లాన్
ఈసారి ఫ్లైట్లో కాకుండా ట్రెయిన్ లేదా రోడ్డు మార్గంలో విశాఖకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. అందుకు అనుగుణంగా యాత్రా వ్యూహాన్ని రచించే బాధ్యతలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అప్పగించారని తెలుస్తుంది. రోడ్డు మార్గంలో వస్తే మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటుగా విశాఖకు తరలే అవకాశాలుంటాయి. అప్పుడు చంద్రబాబు యాత్రను అడ్డుకోవడం వైసీపీ శ్రేణులకు సాధ్యం కాదని టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది.
బాబు పర్యటన తిప్పికొట్టే ప్రతి వ్యూహాలు రచిస్తున్న వైసీపీ
మరోవైపు చంద్రబాబు విశాఖ పర్యటన వ్యూహానికి ప్రతి వ్యూహంతో వైసీపీ నేతలు సిద్దమవుతున్నారు. ఇక దీనిపై దృష్టి పెట్టారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు మరోసారి వైజాగ్కు వస్తారన్న ప్రచారంపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వైసీపీ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యి ఈసారి కూడా చంద్రబాబు విశాఖ పర్యటన వ్యూహాన్ని తిప్పికొట్టాలని సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక టీడీపీ , వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు మరోమారు విశాఖలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠకు కారణం అవుతుంది.