పత్రికల్లో ఏవేవో వస్తుంటాయి!: రంగంలోకి చంద్రబాబు, గంటాకు బుజ్జగింపులు
Recommended Video
అమరావతి: అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మంత్రి గంటా శ్రీనివాస రావుకు మంత్రి నారాయణ, ఉప ముఖ్యమంత్రి చినరాజప్పలు బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. గంటా అసంతృప్తి విషయం తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆయనతో మాట్లాడాలని సూచించారు. దీంతో వారు గంటాతో ఫోన్లో మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు కూడా ఫోన్ చేశారని తెలుస్తోంది.
బుజ్జగింపులు విజయవంతమైతే నేడు ఆయన ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో పాల్గొంటారు. లేదంటే మాత్రం దూరంగానే ఉండే అవకాశముంది. చంద్రబాబు పర్యటనలో ఆయన పాల్గొనే విషయంలో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. డిప్యూటీ సీఎం చినరాజప్ప.. గంటాను కలిసి బుజ్జగించనున్నారు. చంద్రబాబు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
నేనోడిపోతానా.. ఆ సర్వే చిచ్చు: గంటా మనస్తాపం, కేబినెట్ భేటీకి డుమ్మా, బాబు పర్యటనపై డైలమా
మీరు పాల్గొనకుంటే ఇబ్బందికరం
గంటా మంగళవారం నాటి కేబినెట్ భేటీకి గైర్హాజరైన విషయం తెలిసిందే. అయితే, విశాఖపట్నం, భీమిలిల్లో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు హాజరవనున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎంతోను భేటీ అయ్యే అవకాశముందని, అంతరం తొలగిపోయే వీలుందని అంటున్నారు. నారాయణ సహా పలువురు గంటాతో ఫోన్లో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు వైఖరిని తెలియజేస్తూ అర్థం చేసుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. సీఎం పర్యటనలో పాల్గొనకపోతే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరమన్నారు.
చంద్రబాబు ఫోన్
గత కొన్నాళ్లుగా పార్టీలోని ప్రత్యర్థులు తనపై కుట్ర చేయడం, అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పాటు ఇటీవల ఓ సర్వేలో భీమిలి ప్రజల్లో తనపై అసంతృప్తి ఉందని తేలిందని రావడంపై గంటా కినుక వహించారు. ఈ నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు కూడా ఆయనకు ఫోన్ చేశారని తెలుస్తోంది. పత్రికల్లో రకరకాల సర్వేలు వస్తుంటాయని, వాటిని మనసులో పెట్టుకోకుండా మన పని మనం చేసుకోవాలని చెప్పారట.
నన్ను కూడా విమర్శించారు
తన మీద కూడా రోజు రకరకాల వార్తలు వస్తుంటాయని, సర్వేలో నా పని తీరు కూడా బాగాలేదని కొన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయపడినట్లు చెప్పారని, వాటిని ఫీడ్ బ్యాక్గా తీసకొని ముందుకు వెళ్లాలని చంద్రబాబు.. గంటాకు సూచించారట. తనను విమర్శిస్తూ, తన పని తీరును తప్పుబడుతూ పత్రికల్లో ఎన్నో వచ్చాయని గుర్తు చేశారట. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా వార్తలు రావడం సహజమేనని, అవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పారట. కాగా, లగడపాటికి చెందిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఓ పత్రిక కోసం సర్వే నిర్వహించగా.. అందులో భీమిలిలో గంటా కొంత వెనుకబడినట్లు వచ్చింది.
నన్ను టార్గెట్ చేస్తున్నారు
తనను టార్గెట్గా చేసుకున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం జీర్ణించుకోలేకపోతున్నానని గంటా కూడా చెప్పారట. చంద్రబాబు కంటే ముందే మంత్రి నారాయణ, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఫోన్లో మాట్లాడారు. కాగా, భీమిలిలో ఏర్పాటైన కార్యక్రమాలు గంటా సూచించినవే. దీంతో పాల్గొనటమే సరైందని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారట.