పిలవకున్నా పనిగట్టుకు వెళ్తున్న చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నాడు .. వైసీపీ నేత రామచంద్రయ్య ఫైర్
ఏపీలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా రావటం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య... చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.జాతీయ స్థాయిలో ఏ నేతా పిలవకున్నా, పనిగట్టుకుని వెళుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు
చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత తిరిగినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని రామచంద్రయ్య ఆరోపించారు.
జాతీయ నేతలు పిలవకున్నా పనిగట్టుకు పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం లేదంటున్నారని మండిపడ్డారు రామచంద్రయ్య . విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన హుందాతనాన్ని కోల్పోయిన చంద్రబాబును విపక్షాలు పక్కన పెట్టాయని విమర్శలు గుప్పించారు.