వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు .. ఇది తన ఇంటిని ముంచాలనుకుని చేసిన కుట్రన్న బాబు
కృష్ణానది వరదలతో ముంపుకు గురైన విజయవాడలోని గీతా నగర్, భూపేష్ గుప్తా నగర్ ,తారకరామా నగర్ లలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటించారు. వరద ముంపు ప్రాంతాలలో ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు కనీస సహాయం అందలేదని ఆయన వైసీపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కనీస ఆహారం కూడా అందించలేకపోయారు అంటూ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
కృత్రిమ వరద సృష్టించి ఊళ్లకు ఊళ్ళే ముంచేశారని చంద్రబాబు ఆరోపణ
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకు సమస్యలు చెప్పిన బాధితులు తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం అందడం లేదని బాధితులు చంద్రబాబుకు చెప్పుకున్నారు. బాధితులకు సహాయం అందే వరకు తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. ఇక అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వర్షాలు లేకుండా ఊళ్లకు ఊళ్లే మునిగిపోయిన వరద కృత్రిమ వరద అని చంద్రబాబు ఆరోపించారు.
సీఎం ఇంట్లో ఒకాయన కూర్చుని తన ఇంటిపై డ్రోన్ పంపారన్న బాబు
తన ఇంటిని ముంచేందుకు ప్రభుత్వం కుట్ర చేసి, ఇన్ని ఊళ్లను ముంచేసిందని ఇంత ప్రజలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. అయితే వైసీపీ చేసిన కుట్రకు తన ఇల్లు మునగ లేదుగానీ నిరుపేదల ఇళ్ళు మునిగి పోయాయని ఆవేదన చెందారు. ఇవి సహజంగా వచ్చిన వరదలు కాదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు లో కొంత నీటిని ముందుగానే విడుదల చేస్తూ పోతే ఈ ప్రమాదం వచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు. తన ఇంటిని ముంచడానికి నీళ్లను ఆపి ఒకేసారి వదిలారని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం ఇంట్లో ఒకాయన కూర్చొని తన ఇంటిపైకి డ్రోన్ పంపారని చంద్రబాబు విమర్శించారు. కనీసం జలాశయాలు నింపే ప్రయత్నం చేయకుండా నీటిని ఇళ్ల పైకి వదిలారని, డ్రోన్ ద్వారా ఫొటోలు తీయడమే కాదు, బాంబులు కూడా పంపొచ్చు అని వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాల్లో మంచినీళ్లుకూడా సరఫరా చేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరదముంపుతో ప్రజలు ఇబ్బంది పడితే అవేవీ పట్టించుకోకుండా తన ఇంటిపైనే వైసీపీ మంత్రుల ధ్యాస అన్న చంద్రబాబు
ఆయన తన ఇల్లు మునిగితే తనకు, సంబంధిత ఇంటి ఓనర్ కు లేని బాధ వైసీపీ నేతలకు ఎందుకు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మంత్రులు పదేపదే ఇంటి చుట్టూ తిరగడం దేనికి అంటూ మండిపడ్డారు. ఒకపక్క ప్రజలు వరద ముంపు తో కష్టాలు పడుతుంటే మరోపక్క మంత్రులు తన ఇంటి చుట్టూ తిరిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ లను మూసివేసి పేదల ఆకలి తీరకుండా చేశారని, ఈ సమయంలో అవి ఉంటే ఎంతోకొంత బాధితుల ఆకలి తీరే దని ఆ పేర్కొన్నారు. సీఎం జగన్ మాటల మనిషే కాని చేతల మనిషి కాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని చంద్రబాబు పేర్కొన్నారు . అంతే కాక స్థానికులకు పట్టాలు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు