హజ్ యాత్రికులపై జీఎస్టీ ఏంటి?...ఇది చాలా దారుణం...బిజెపి ఆటలు సాగనివ్వం:ముస్లింల సభలో చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బిజెపి ఆటలు సాగనివ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జగన్తో లాలూచీ కారణంగానే భాజపా రాష్ట్రానికి ఏమీ చేయని పరిస్ధితి నెలకొందని ఆయన విమర్శించారు.
ఎపి ప్రభుత్వం సాయంతో రాష్ట్రం నుంచి మొత్తం 2,348 మంది ముస్లింలు హజ్ యాత్రకు సిద్ధం కాగా...తొలి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 200 మంది ముస్లింలు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా అమరావతిలో శుక్రవారం ముస్లింలు కృతజ్ఞత సభ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ హజ్ యాత్రికులపైనా కేంద్రం జీఎస్టీ విధిస్తుండటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుతో యాత్రకు వెళ్లనున్న ముస్లింలు తమకు ఆ అవకాశం కల్పించిన సిఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు అమరావతిలోని ప్రజావేదిక వద్ద శుక్రవారం సభ ఏర్పాటుచేశారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లింలు... 'నారా హమారా.. తెదేపా హమారా' అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ 2019లో హజ్ యాత్రకు గన్నవరం విమానాశ్రయం నుంచే విమానాలు బయలుదేరతాయని ప్రకటించారు. విజయవాడలో రూ.80 కోట్లతో, కడపలో రూ.12కోట్ల హజ్ హౌస్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని సిఎం చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రికులపైనా జీఎస్టీ విధిస్తుండటం బాధాకరమని...దారుణమని మండిపడ్డారు. ఎపిలో బిజెపి ఆటలు సాగనివ్వమన్నారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బిజెపికి సహకరించేందుకే వైసిపి ఎన్నికలో పాల్గొనలేదని సిఎం చంద్రబాబు ఆరోపించారు. గోద్రా అల్లర్ల సమయంలో అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని రాజీనామా చేయాల్సిందిగా తాను గట్టిగా పట్టుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. అయితే ఈ విషయమై అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానన్నారు.
ముస్లిం మైనారిటీల ఉన్నత చదువులకు రూ.10-15 లక్షలు సాయం చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముస్లింలకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని అల్లాకు దువా చేయాలన్న చంద్రబాబు...ముస్లింలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కొద్ది సేపు ఉర్దూలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్న సీఎం...అనంతరం ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు.