మోడీ-షా, వైఎస్ జగన్-కేసీఆర్ అందరూ రైటే..చంద్రబాబు ఒక్కరే లెఫ్ట్: ఏమాకథ?
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు అందరు రాజకీయ నాయకులూ రక్షాబంధన్ పండుగను ఆనందంగా నిర్వహించుకున్నారు. ఆయా నేతల అభిమానులు, కుటుంబ సభ్యులు వారికి రక్షాబంధన్ లను కట్టారు. వారందరిలోకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త డిఫరెంట్ అనిపించుకున్నారు. దీనికి కారణం- మిగిలిన నాయకులంతా తమ కుడిచేతికి రాఖీలను కట్టించుకుంటే.. చంద్రబాబు మాత్రం ఎడమచేతికి రాఖీ కట్టుకుంటూ కనిపించారు. వారందరిదీ రైట్ అయితే..చంద్రబాబు మాత్రం లెప్ట్ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు రోజులుగా చంద్రబాబు కుడిచేతి నొప్పితో బాధపడుతున్నారు. దాని ఎఫెక్టే ఇది.
రక్షా బంధన్ లతో కళకళ..
రాఖీ పూర్ణిమ సందర్భంగా పలువురు చిన్నారులు నరేంద్ర మోడీకి రాఖీ కట్టారు. న్యూఢిల్లీలోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో వచ్చిన చిన్నారులతో ప్రధాని రక్షాబంధన్ ను కట్టించుకున్నారు. వారితో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు మహిళా ఉద్యోగులు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మహిళా ప్రతినిధులు మోడీకి రాఖీ కట్టారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడున్న చిన్నారులతో మెడీ చిన్నారులతో చాలాసేపటి వరకు సరదాగా ముచ్చటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పలువురు పార్టీ మహిళా కార్యకర్తలతో పాటు ఆయన శాఖకు చెందిన మహిళా ఉద్యోగులు రాఖీ కట్టి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.
హైదరాబాద్ లో కేసీఆర్..అమరావతిలో వైఎస్ జగన్
హైదరాబాద్ లో కే చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కే తారక రామారావు తమ నివాసంలో రాఖీ కట్టించుకున్నారు. కేటీఆర్ కు ఆయన సోదరి, లోక్ సభ మాజీ సభ్యురాలు కవిత..రాఖీ కట్టారు. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిళ రాఖీ కట్టారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరూ రక్షా బంధన్ లను కట్టుకున్నారు. వారందరూ కుడి చేతికి రక్షాబంధన్ లతో కనిపించగా చంద్రబాబు నాయుడు దీనికి భిన్నంగా ఎడమ చేతికి రాఖీలతో కనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు టీడీపీ మహిళా నాయకులు, ఏపీ మహిళా మాజీ మంత్రులు చంద్రబాబును జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి రాఖీ కట్టారు. శుభాకాంక్షలను తెలిపారు.
లెఫ్టిస్ట్ అనిపించుకున్న చంద్రబాబు..
ఈ సందర్భంగా వారంతా చంద్రబాబు ఎడమ చేతికి రాఖీలను కట్టడం కనిపించింది. దీనికి కారణం- ఆయన కుడిచెయి నొప్పితో బాధపడుతుండటమే. రెండురోజుల కిందట చంద్రబాబు కుడిచెయ్యి నరం కాస్త బెణికింది. ఫలితంగా- చేతి వేళ్లు వంచడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. చేతి వేళ్లు వంచితే.. నరంపై భారం పడుతోందని, ఫలితంగా మెలితిప్పే నొప్పి కలుగుతోందని చంద్రబాబు స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నొప్పి వల్ల ఆయన తన కుడి చేతికి కట్టు కట్టుకున్నారు. ఆ కట్టుతోనే విజయవాడలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విశ్రాంతి కోసం హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు. నాలుగు రోజుల తరువాత చంద్రబాబు అమరావతికి చేరుకోవచ్చని తెలుస్తోంది.