రేపటితో చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి అన్న విజయసాయి రెడ్డి
మరి కొన్ని గంటల్లో వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి అవుతారంటూ... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబును విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ లు పెట్టే విజయసాయి రెడ్డి చంద్రబాబుపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దేశ దిమ్మరి యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రిజల్ట్స్ డే.. ఆర్డీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలయ్య బస .. ఎందుకంటే
23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేసిన విజయసాయి రెడ్డి
‘‘23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాథి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు.'' అని ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఏపీలో ఎన్నికల కౌంటింగ్ను నిలిపి వేయించడానికి చేయని కుతంత్రం లేదని విజయసాయి ఆరోపించారు.
వీవీ ప్యాట్ ల విషయంలో చంద్రబాబు వాదన మూర్ఖపు వాదన అన్న విజయసాయి
వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడని తెలిపారు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయని ట్విటర్లో చురకలంటించారు. ‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్ లాంటి పరికరాలే వీవీప్యాట్లు. ఇవిఎంలలో నమోదైన ఓట్ల ఆధారంగానే లెక్కింపు ఉంటుంది. వివిప్యాట్లను ముందు లెక్కించాలనే వాదన చూస్తే, గుర్రం బలంగా ఉందో లేదో చూడకుండా దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండులాగా కనిపిస్తోంది.'' అని చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు తిరుగుళ్ళు దేశ దిమ్మరి యాత్రలు అని ఎద్దేవా చేసిన విజయ సాయి
‘‘ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. కానీ చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు.'' అని ట్వీట్ లో ఆరోపించారు.