బాబు సిఎం: సబ్బం, జగన్ను ఒప్పుకోలేదని ఆగ్రహం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పట్టణ ప్రజలు ఒప్పుకోలేదని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు ముఖ్యమంత్రి అవుతారని మాజీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరి సోమవారం అన్నారు. సీమాంధ్రలో ప్రత్యామ్నాయంగా జగన్ను పట్టణ ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదన్నారు.
సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీకి కాలం చెల్లిందన్నారు. కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరించరన్నారు. జగన్కు గుప్త అజెండా ఉందని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
తమదే విజయం: దేవినేని
మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించినట్లుగానే జెడ్పీటిసి, ఎంపీటిసి, అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లోను తామే గెలుస్తామని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడలో అన్నారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని చెప్పారు.
ప్రజల తీర్పు తేటతెల్లమైందన్నారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చారని అన్నారు. రాజధాని నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణాన్ని తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా చేయగలరని ప్రజలు విశ్వసించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చంద్రబాబు తీర్చిదిద్దగలరన్నారు.