ప్రభాస్ కల్సిన సమయంలో బిజెపి నేతతో 'హోదా'పై మోడీ! వదలం: చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పైన ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో హామీ ఇవ్వనున్నారా? ఆయన త్వరలో ఏపీలో పర్యటిస్తారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
హామీల అమలు పైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ప్రత్యేక హోదా హామీ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మంత్రులు, ఇతర సీనియర్లతో భేటీ అయ్యారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి బాధ్యత తనదేనని, ప్రత్యేక హోదాను వలిది పెట్టమని చంద్రబాబు మంత్రులతో వ్యాఖ్యానించారని సమాచారం. ప్రధాని మోడీ కూడా వచ్చే నెల ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
బీహార్ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని మోడీ భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇటీవల సినీ నటుడు ప్రభాస్ ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో ప్రభాస్తో పాటు ఉన్న ఓ బీజేపీ నేతతో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం చేసిన సాయం గురించి ప్రజలకు తెలియజెప్పడంలో పార్టీ నేతలు విఫలమైనట్లు మోడీ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
అంతేకాకుండా బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక సాయాన్ని అందించలేకపోతున్నామని, బీహార్ ఎన్నికల అనంతరం ఏపీలో పర్యటించి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని ప్రధాని భావిస్తున్నట్లుగా సమాచారం.
ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 16- 19 తేదీల మధ్యలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రధాని సహా కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి తదితరులను కలుసుకోవడానికిచ అపాయింట్మెంట్లు ఖరారు చేయాలని సూచించారు.
శనివారం సాయంత్రం చంద్రబాబు ఇక్కడ లేక్ వ్యూ అతిథి గృహంలో మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో కోటి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసింది. దీనిపై చర్చించారు.
ఈ సమావేశం నుంచే చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకొన్నారు. కోటికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ప్రత్యేక హోదాతోపాటు ఇతర హామీలను సాధించడానికి ఇప్పటి వరకూ జరిగిన కృషిని, భవిష్యత్ కార్యాచరణను ఆయన పార్టీ నేతలతో సమీక్షించారు.
మన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పోలిస్తే ఆదాయం, వనరులు, వసతులపరంగా మనం చాలా వెనకబడి ఉన్నామని, అశాస్త్రీయ రాష్ట్ర విభజన వల్లే మనకు ఈ పరిస్థితి వచ్చిందని, విభజన చేసిన కేంద్రానికి ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని బాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలిగే పరిస్థితి వచ్చే వరకూ కేంద్రం సహకరించాలని, ఇందులో రాజీ లేదని, ఇదే విషయాన్ని మనం అనేకసార్లు కేంద్రానికి చెప్పామని, మళ్లీ మళ్లీ చెబుతామని, మనకు ఏం కావాలో వాటిని రాబట్టుకొందామని అన్నారు.
ప్రత్యేక హాదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల ఆర్ధికాభివృద్ధికి సాయం, రైల్వే జోన్ ఏపీకి కావాలని, వీటిని ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇవన్నీ వస్తేనే కొంతవరకైనా నిలదొక్కుకోగలగుతామని, ఏం కావాలో మనకు స్పష్టత ఉందన్నారు.