కోర్టు ఆర్డర్, ఓటుకు నోటు షాక్: 'మోడీ-కేసీఆర్ కూడా బాబును కాపాడలేరు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎవరూ కాపాడలేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం నాడు అన్నారు.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నా ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరన్నారు.
కోర్టు ముందుకు బాబు స్వరంపై నివేదిక: నోటుకు ఓటుపై పునర్విచారణత్వరలో ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు బయటకు రాబోతున్నాయన్నారు. గతంలో ఈ కేసులో చంద్రబాబును రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు.
ప్రతిఫలంగా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు జరిగి పద్నాలుగు నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం అదనపు ఛార్జీషీటు ఎందుకు దాఖలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఆ వాయిస్ బాబుదే: వాసిరెడ్డి
ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ చంద్రబాబుదేనని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఓటుకు నోటు కేసు ఆడియో టేపులో 'బ్రీఫ్డ్ మీ' అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆ వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ పరీక్షలు రుజువు చేస్తున్నాయన్నారు.
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఈ కేసు పునర్విచారణ చేయాలని సోమవారం నాడు ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చే నెల 29వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది.