నేడు అమరావతిలా, నాడు ఆస్తానా కష్టాలు: పట్టుబట్టి బాబుని పంపిన మోడీ
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కజకిస్తాన్ రాజధాని ఆస్తానాను చూసి ముగ్ధులయ్యారు. ఆస్తానా నిర్మించిన పద్ధతులను, పరిజ్ఞానాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. రాజధాని నిర్మాణం పరీక్షించేందుకు బాబు బృందం ఆస్తానాలో పర్యటించిన విషయం తెలిసిందే.
కేబుల్ కారు పైన మనసుపడ్డ చంద్రబాబు, ఏపీకి తీసుకొచ్చే యోచన
రష్యా నుంచి విడిపోయిన తర్వాత కజకిస్తాన్ కష్టాలు పడింది. వాటన్నింటిని అధిగమించి పద్దెనిమిదేళ్ల క్రితం అద్భుతమైన నగరాన్ని ఆస్తానాను నిర్మించుకుంది. చంద్రబాబు ఇక్కడి కేబుల్ కారులో ప్రయాణించి మనసు పడ్డారు. తిరుమల తదితర చోట్ల దీనిని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
మీరు చేయగలరు!
కజకిస్తాన్ రాజధాని ఆస్తానా నగర రూపకల్పనకు ప్రభుత్వ, విదేశీ, ప్రయివేటు కంపెనీల నుంచి పెట్టుబడులు సమీకరించామని కజకిస్థాన్ మంత్రి బెతోవ్.. ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించారు. విద్యుత్తు, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాలన్నీ భూగర్భం నుంచే నిర్మించామన్నారు.
నగర నిర్మాణంలో సింహ భాగాన్ని మౌలిక వసతుల కల్పనకే ఖర్చు పెట్టామన్నారు. పక్కా ప్రణాళిక ఉంటే కొత్త నగరాలను నిర్మించడం సులభతరమేనని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 20 బిలియన డాలర్లకు తగ్గకుండా పెట్టుబడులను ఆకర్షిస్తారనే నమ్మకం తనకుందన్నారు.
ప్రపంచంలో డబ్బుకు కొదవ లేదని, పెట్టుబడులకు భరోసా కల్పిస్తే చాలని అభిప్రాయపడ్డారు. నిబంధనలు, చట్టాలు సరళతరంగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. తాము నమ్మకం కల్పించాము కాబట్టే పెట్టుబడుదారులు ముందుకు వచ్చి ఆస్తానాను అద్భుతంగా నిర్మించారన్నారు.
విభజన కష్టాల నుంచి నిర్మితమైన ఆస్తానా తరహాలోనే అమరావతి కూడా అద్భుతమైన నగరంగా ఏర్పడుతుందని కజకిస్థాన్ రక్షణ మంత్రి బెతోవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు దూరదృష్టితో ఆస్తానా కన్నా వేగంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆస్తానా ప్రస్థానం
తమ రాజధాని నిర్మాణంలో ఎదుర్కొన్న కష్టాలను ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు వివరించారు. రష్యా నుంచి విడిపోయిన తొలినాళ్లలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకూ డబ్బులేని పరిస్థితి అని, అలాంటి క్లిష్య సమయంలో తమ వైద్యులు, ఉద్యోగులు సహకరించారని, ఏడాదిపాటు జీతాలు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందించారని చెప్పారు.
కొత్త రాజధాని ఎందుకన్నారు..
తీవ్రమైన విభజన కష్టాలను ఎదుర్కొంటున్న కజకిస్థాన్కు కొత్త రాజధాని అవసరమా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారని రక్షణ మంత్రి బెతోవ్ చెప్పారు. అయితే, కొత్త రాజధానిని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికీ వివరించామన్నారు. ప్రస్తుతం ఆస్తానా 18వ వార్షికోత్సవం జరుపుకుంటోందన్నారు.
పాత రాజధాని అల్మాటి దేశానికి ఓ మూలన ఉండేదని, దేశం నడిబొడ్డున రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించామని, వారు కూడా తమ ప్రభుత్వ వాదనతో ఏకీభవించారని బెతోవ్ తెలిపారు. 99 శాతం మంది రాజధాని నిర్మాణంపై సందేహం వ్యక్తం చేశారని, తమ అధ్యక్షుడికి సాధించగలమనే నమ్మకం ఉందని, ధైర్యంగా ముందడుగు వేశారని చెప్పారు.
అమరావతి నిర్మాణంలో.. ఆస్తానా పద్ధతులు!
అమరావతి నిర్మాణంలో మీ రాజధాని ఆస్తానా పద్ధతులు, పరిజ్ఞానాన్ని వాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు కజకిస్తాన్ మంత్రి బెతోవ్తో అన్నారు. మీ నగర నిర్మాణానికి అనుసరించిన పద్ధతుల్ని తెలసుకొనేందుకే మేం వచ్చామని చంద్రబాబు చెప్పారు.
ఆస్తానా అభివృద్ధి ప్రస్థానాన్ని, నగర నిర్మాణాన్ని చూసి ముగ్ధుడైన మా ప్రధాని నరేంద్ర మోడీ తనను కూడా ఆస్తానా చూసి రావాలని పదే పదే సూచించారని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు సైబరాబాద్ పేరిట కొత్త నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందన్నారు. ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించే బాధ్యత తన పైన ఉందన్నారు.