పులివెందులపై నిందలు: చంద్రబాబు తప్పులో కాలేశారా?
విజయవాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన సందర్భంగా చెలరేగిన హింసపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఉద్వేగానికి గురై మాట్లాడినట్లే కనిపించారు. ఆ ఉద్వేగంలో ఆయన తప్పులో కాలేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుని ఘటనలకు పులివెందులను కించపరుస్తూ మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉభయ గోదావరి జిల్లాలు చాలా ప్రశాంతమైనవని కూడా అంటూ తుని ఘటనలు పులివెందుల వాళ్ల పనే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం పులివెందులకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నవే అయినప్పటికీ అవి ఓ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అంటున్నారు.
రాయలసీమ ప్రాంతాన్ని, ముఖ్యంగా పులివెందులను చంద్రబాబు అవమానించారని అంటున్నారు. రాజధాని అమరావతి మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి చంద్రబాబు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ స్థితిలో చంద్రబాబు పులివెందుల వ్యాఖ్యలు మరింతగా ఆ ప్రాంత ప్రజలను బాధపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే, పులివెందులవాళ్లే తుని ఘటనలకు కారణమని చంద్రబాబు చెప్పినప్పటికీ కేసులు మాత్రం కాపు నాయకుల మీద పెట్టడంపై కూడా చంద్రబాబు మీద ప్రశ్నలు కురుస్తున్నాయి. బిజెపి నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఇప్పటికే ఆ ప్రశ్న వేశారు.
తుని ఘటనపై పోలీసులు 27 మంది ముఖ్య కాపు నాయకుల మీద కేసులు పెట్టారు. వారిలో తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు కూడా ఉన్నారు. బిజెపి నాయకుడు కన్నా లక్ష్మినారాయణపై కూడా కేసు నమోదైంది. పులివెందులకు చెందినవారి మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు కేసుల అలా ఎలా పెడుతారని, అలాంటప్పుడు పులివెందుల ప్రమేయం లేనట్లే కదా అనే మాట వినిపిస్తోంది.