చంద్రబాబు లేఖ: పేదలు, రైతుల వెతలు, విరాళాల పేరుతో వేధింపులు సరికాదు..
కరోనా వైరస్ వల్ల పేదల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. లాక్డౌన్ వల్ల రైతులు కుదేలయ్యారని పేర్కొన్నారు. వారి సమస్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. కానీ కొందరు వైసీపీ నేతలు విరాళాల పేరుతో వేధిస్తున్నారని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఇది సరికాదని హితవు పలికారు.
వైసీపీ నేతల తీరు కరోనా వైరస్ను మించి ఉంది అని పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం హేయనీయమన్నారు. జగన్ సర్కార్ 25 లక్షల రేషన్ కార్డులను తొలగించిందని గుర్తుచేశారు. వారికి రేషన్ సహా నగదు అందలేదని, దీంతో వారు ఇబ్బందిపడుతున్నారని గుర్తుచేశారు. ఏపీలో వైరస్ కోసం చేస్తున్న టెస్టులపై చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు చేయకుండానే కేసులు పెరిగినట్టు చూపిస్తున్నారని చంద్రబాబు ప్రస్తావించారు. ఒకరోజు ముందు నెగిటివ్ చూపించి.. మరునాడు పాజిటివ్ చూపిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో హెల్త్ బులెటిన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి, డ్యాష్ బోర్డు సమాచారంలో ఏదీ నిజం అని అడిగారు. ఒక్కొక్కరు ఒక్కో సమాచారం అందజేస్తున్నారని తెలిపారు. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారి చెప్పారు.