టిట్లీతో భారీ నష్టం, రూ.1200కోట్లు ఇవ్వండి: మోడీకి చంద్రబాబు లేఖ, బైక్పై లోకేష్ పర్యటన
అమరావతి: టిట్లీ పెను తుఫాను కలిగించిన భారీ నష్టాన్ని వివరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి శనివారం లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు.
టిట్లీ తుఫాను: చంద్రబాబుకు మోడీ ఫోన్, పరిస్థితిపై ఆరా
భారీ నష్టం
టిట్లీ తుఫాను కారణంగా విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ. 100 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు మరో రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. వ్యవసాయ, ఉద్యాన తోటలకు సంబంధించి రూ.1800 కోట్ల నష్టం వాటిల్లగా పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.100కోట్ల మేర నష్టం కలిగిందని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రం ముందుకు రావాలి..
గ్రామీణ నీటిసరఫరా శాఖకు రూ.100 కోట్లు, జలవనరుల శాఖకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలను వేగవంతం చేసిందని.. కేంద్రం కూడా ముందుకు వచ్చి ఉదారంగా సాయం అందించాలని కోరారు.
బైక్లపై తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి లోకేష్
కాగా, తుఫాను ప్రభావిత ప్రాంతాలైన హరిపురం, ఉద్దానంలో మంత్రి నారా లోకేష్, ఎంపీ రామ్మోహన్నాయుడు ద్విచక్ర వాహనంపై శనివారం పర్యటించారు. బాధిత ప్రజలతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
ఎమ్మెల్యేల నెల జీతం..
టిట్లీ తుఫానుతో భారీగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. అతలాకుతమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.