పవన్ ఇంట్లో రంజాన్ వేడుకలు: ప్రజలకు చంద్రబాబు, జగన్ శుభాకాంక్షలు
హైదరాబాద్/అమరావతి: రంజాన్ పండగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
చంద్రబాబు శుభాకంక్షలు
రంజాన్ సందర్భంగా ముస్లింసోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏ మతం వాళ్ళైనా రాష్ట్రంలో నిర్భయంగా బతికే ధైర్యం తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
నమాజ్ చేసిన చంద్రబాబు
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పెద్దయెత్తున తరలివచ్చిన ముస్లింలతో కలిసి చంద్రబాబు కూడా సంప్రదాయ పద్ధతిలో నమాజ్ చేశారు. ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ఆనందం కోసం నెల రోజుల పాటు పవిత్రంగా ముస్లిం సోదరులు ఉపవాసం పాటించారన్నారు. కొత్త రాష్టానికి అన్ని విధాలా సహకరించి ప్రజలంతా ఆనందంగా ఉండేలా చూడాలని అల్లాను కోరుతున్నానని సీఎం తెలిపారు.
అల్లా ఆశీస్సులు.. జగన్ సందేశం
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని వైయస్ జగన్ అన్నారు. అల్లా ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
పవన్ ఇంట్లో రంజాన్ వేడుకలు
హైదరాబాద్లోని తన నివాసంలో రంజాన్ పండగ జరుపుకున్నామని, తనపై ప్రేమ చూపించే ప్రతి ఒక్కరికీ.. సన్నిహితులకు ఈ పవిత్రమైన రోజున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి తాను ఉన్న ఓ ఫొటోను పోస్టు చేశారు. ‘మానవత్వాన్ని మేలుకొలిపేది రంజాన్.. మానవులను మంచిగా బతకమని చెప్పేది రంజాన్.. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్' అని పేర్కొన్నారు.