ఆసక్తికరం: ఒకే ప్రాంతంలో బాబు, జగన్ సంక్రాంతి సంబరాలు
చిత్తూరు: ఈ సంక్రాంతి పండగను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకే జిల్లాలో, ఒకే నియోజకవర్గ పరిధిలో జరుపుకోనున్నారు. వైయస్ జగన్ తన పాదయాత్రను చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
కాగా, చంద్రబాబు దాదాపు ప్రతి సంవత్సరం తన సొంత ఊరైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండగను చేసుకుంటారు.
నారావారిపల్లెలో బాబు
చంద్రబాబునాయుడు జనవరి 13వ తేదీ చిత్తూరు, తిరుపతిలో పర్యటించి.. సాయంత్రానికి నారావారిపల్లెకు చేరుకుంటారు. సంక్రాంతి సందర్భంగా 14, 15 తేదీల్లో అక్కడే ఉంటారు. 16వ తేదీ కనుమ పండుగ విందు ఆరగించి అమరావతికి బయలుదేరతారు.
పాదయాత్రలో జగన్
ప్రస్తుతం వైయస్ జగన్ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం ఆయన జనవరి 14వ తేదీ ఉదయానికంతా చంద్రగిరి నియోజకవర్గ సరిహద్దులు దాటాల్సి ఉంది.
మార్పులతో జగన్ ఇక్కడే..
అయితే, ప్రజాసంకల్ప యాత్ర మార్గంలో మార్పుల నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలో జగన్ పర్యటించనున్నారు. ప్రజలను కలుస్తూ ఇక్కడే పండగరోజును జరుపుకోనున్నారు.
ఆసక్తికరంగా మారిన బాబు, జగన్ బస
ఇలా ప్రభుత్వాధినేత, ప్రతిపక్ష నేత ఇద్దరూ సంక్రాంతి పండగ సమయంలో ఒకే నియోజకవర్గ పరిధిలో సమీప గ్రామాల్లో బస చేయనుండటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తన సొంత గ్రామంలో సంక్రాంతి పండగను జరుపుకోనుండగా, జగన్ తన పాదయాత్రలో.. బాబు గ్రామానికి సమీపంలోని మరో గ్రామంలో ప్రజలతో పండగ జరుపుకోనున్నారు.