Eluru Illness Update: ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించండి: ఏలూరు వింత వ్యాధిపై జగన్ కు చంద్రబాబు లేఖ
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఏలూరులో అంతుచిక్కని వ్యాధి పై లేఖ రాశారు. ఏలూరులో పరిస్థితి దారుణంగా ఉందని జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం ఐదు రోజుల్లోనే ఆరేడు వందల మంది ఆస్పత్రి పాలు కావడం విషాదమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం, కారణాలు తెలియక పోవడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్న చంద్రబాబు రోజుకో రీతిలో రోగలక్షణాలు మారిపోవడంపై ఆవేదన చెందుతున్నామని పేర్కొన్నారు.
సురక్షిత తాగునీరు అందించటం ప్రభుత్వ కర్తవ్యం
సురక్షిత తాగునీరు అందకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఏలూరు దుర్ఘటనకు కారణం ఏమిటి? ఎందుకు జరిగింది ? ఎలా జరిగింది అన్న మూలాల అన్వేషణ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు డిమాండ్ చేశారు. సురక్షిత తాగునీరు పొందటం ప్రజల హక్కు అని పేర్కొన్న చంద్రబాబు తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యమని లేఖలో స్పష్టం చేశారు .సురక్షిత త్రాగునీటి పొందే హక్కు పౌరులకు ఉందని, అది పౌరుల ప్రాథమిక హక్కుగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో విఫలం కావటం శోచనీయం
భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 కూడా అదే నిర్దేశించింది అని చంద్రబాబు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో సురక్షిత తాగునీటి సరఫరాలో , పారిశుద్ధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ పేర్కొన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో విఫలం కావడం శోచనీయంగా ఉందన్నారు. అసలు ఇప్పటివరకు ఏలూరు దుర్ఘటన విషయంలో చేపట్టిన పరీక్షలు వివరాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు కోరారు. బాధితుల్లో భయాందోళన తొలగించాలని, నమ్మకం పెంచాలని, ప్రభుత్వం వారి విశ్వాసాన్ని పొందాలని చంద్రబాబు సూచించారు.
ఏలూరు ప్రజల భయాందోళన తొలగించాలని కోరిన చంద్రబాబు
ప్రజలందరికీ ధైర్యం కలిగించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. ఏలూరులో ఉన్నవారికి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన ఇంకా పోలేదని, ఆ భయాందోళనలు తొలగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజారోగ్యంపై భరోసా పెంచాలని లేఖలో వెల్లడించారు చంద్రబాబు. ఏలూరులో తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు. తాగునీటిలో లిడ్, నిఖిల్ ఉన్నాయన్న సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతోందని అన్నారు. దీనివల్ల చిన్నారులు ,గర్భిణులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు చంద్రబాబు.
ఏలూరు బాధితులకు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు ఇవ్వాలన్న బాబు .. సైంటిఫిక్ స్టడీ చెయ్యాలని సూచన
ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు అందజేయాలని, దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలని చంద్రబాబు పేర్కొన్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, జాతీయ అంతర్జాతీయ నిపుణులతో వారికి వైద్యం చేసేలా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏలూరు దుర్ఘటన నేపథ్యంలో అక్కడ తాగునీరు, పాలు తదితరాలపై సైంటిఫిక్ స్టడీ చేయాలని పేర్కొన్న చంద్రబాబు హెల్ప్ లైన్ చేయాలనే ఆలోచన రాకపోవడం మరో వైఫల్యం అంటూ మండిపడ్డారు. బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం లను, లక్షణాలు కనిపించిన వెంటనే రోగులకు తక్షణ వైద్యం అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
Recommended Video
మొబైల్ మినరల్ వాటర్ ప్లాంట్లను, క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చెయ్యాలి
సత్వర ఉపశమన చర్యలు, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హుదూద్ తుఫాన్ సమయంలో అందించినట్లుగా మొబైల్ మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడికక్కడ క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలని, ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమాతో పాటు జీవిత బీమా కల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణపై వారిలో అవగాహన పెంచాలని లేఖలో పేర్కొన్న చంద్రబాబు, భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై కూడా అధ్యయనం చేయాలని, ఎలాంటి ప్రాణ హాని జరగకుండా, ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని తన లేఖ ద్వారా చంద్రబాబు స్పష్టం చేశారు.