ఎన్టీఆర్పై బాబు పొగడ్తలు: "దేవుళ్ల రూపాల్లో ఎన్టీఆర్, ఇందిరను గడగడలాడించారు"
విజయవాడ : ఏపీ ప్రజల ఆరాధ్యం ఎన్టీఆర్ ను దైవ సమానులుగా సంబోధించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు లాంటి దేవుళ్ల రూపాలను ఆయన ప్రజలకు చూపించగలిగారని కొనియాడారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని పొట్టిపాడులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన.
ఎన్టీఆర్ ఒక మనిషికాదు ఒక వ్యవస్థ అని పేర్కొన్న చంద్రబాబు.. కాంగ్రెస్ను ఎన్టీఆర్ ఎదుర్కొన్న తీరు అద్భుతమని అన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఎన్టీఆర్ గడగడలాడించారని, అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోను చక్రం తిప్పగలిగారని ప్రశంసించారు. నిమ్మకూరులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ ను దేవుళ్ల రూపంలో చూసుకోగలిగామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అమరావతి నిర్మాణంలో ముందుకు వెళదమన్నారు.
ఎన్టీఆర్ మాటల మనిషి కాదని చేతల మనిషి అని తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా అభిప్రాయపడ్డారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఏదైతే చెబుతారో అదే పాటిస్తారని చెప్పారు. పేదలందరికీ తిండి, బట్ట, ఇల్లు అందించడానికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన్నుంచి అనేక మంచి విషయాలను నేర్చుకున్నాని ఈ సందర్బంగా చంద్రబాబు తెలియజేశారు.
'పేదరికం లేని సమాజం కోసం రూ.200 ఫించన్ ను రూ.వెయ్యికి పెంచగలిగాను. నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగులుకైనా ఒకరోజు జీతం ఆలస్యమవచ్చు గానీ ఫించను మాత్రం సకాలంలో అందజేస్తున్నాం. నేను ఏ పనిచేసిన పేదవారినే దృష్టిలో పెట్టుకునే చేస్తా. ఫించను ఇవ్వడం ద్వారా ప్రతీ పేదింటికి నేనో పెద్ద కొడుకుగా మారాను' అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ :
అమరావతి : మరో 20 రోజుల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉపాధ్యాయుల కోటాలో జరగబోయే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలుపొందాలని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు.
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్ధేశం చేశారు చంద్రబాబు. పక్కా ప్లానింగ్, మంచి పనితనం ఉంటే పరోక్ష ఎన్నికల్లో గెలుపు సాధించడం సులువని నేతలకు వివరించినట్లుగా సమాచారం.