చంద్రగిరి రీ పోలింగ్ వివాదం ? న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీ
విజయవాడ : చంద్రగిరి రీ పోలింగ్పై న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 40 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని .. ఎన్నికల సంఘం తీరును ఏపీ మంత్రి లోకేశ్ తప్పుపట్టారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు.
నిజమైనవేనా ?
చంద్రగిరిలో రీ పోలింగ్కు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేస్తామంటోన్న వీడియోలపై సందేహాం వ్యక్తం చేశారు లోకేశ్. అవి నిజమో, కాదోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో 19 చోట్ల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. కానీ వైసీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం స్పందించి రీ పోలింగ్ నిర్వహించిందని .. ఇందులో ఆంతర్యం ఏముందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఎన్నికల సంఘంతో వైసీపీ కుమ్మక్కైందని .. తర్వాత సీఎస్కు ఫిర్యాదు చేయడంతో రీ పోలింగ్ నిర్వహించారని ఆరోపించారు. టీడీపీ 19 చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని కోరినా .. పట్టించుకోలేదని, ఇవాళ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు మరోసారి తమ మంత్రులు వినతపత్రం అందజేశారని గుర్తుచేశారు.
మోదీ కనుసన్నల్లో ..
పనిలోపనిగా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి లోకేశ్. మోదీ, అమిత్ షా కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. మోదీ కమిషన్ ఆఫ్ ఇండియాగా .. ఈసీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. అంతేకాదు బెంగాల్ లో ఒకరోజు ఎన్నికల ప్రచారం నిలిపివేయడం దారుణమన్నారు. దేశ చరిత్రలో ముందెప్పడూ ఇలా జరుగలేదని గుర్తుచేశారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కొనసాగుతుందన్నారు. తమకు ఈసీ ప్రత్యర్థి కాదని .. అవి అవలంభించే విధానాలనే వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.
హైకోర్టులో పిటిషన్ .. విచారణకు స్వీకరణ
చంద్రగిరి నియోజవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ విషయంపై హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామచంద్రాపురం మండలంలోని 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఫిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.అయితే, పిటిషన్ విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను శనివారానికి వాయిదా వేసింది.