గిన్నీస్ రికార్డుకు చంద్రన్న భీమా : ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్న అచ్చెన్న
విజయవాడ : రాష్ట్ర ప్రజల సంక్షేమార్థం 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని గిన్నీస్ రికార్డుల్లో ఎక్కించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. 'చంద్రన్న బీమా' పథకాన్ని గిన్నిస్ రికార్డుకు పంపే ప్రతిపాదనల్లో ఉన్నామని ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
'చంద్రన్న బీమా' కు సంబంధించి సోమవారం నాడు తొలి సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్బంగా.. ఈ విషయాన్ని వెల్లడించారు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.70 కోట్ల మంది 'చంద్రన్న బీమా'లో సభ్యులుగా చేరారని, మరో 60 లక్షల మంది దాకా సభ్యులుగా చేరే అవకాశముందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైందన్నారు.
ఇక గిన్నీస్ రికార్డు విషయానికొస్తే.. ప్రపంచంలో ఇంత భారీ ఎత్తున భీమాను నమోదు చేసిన ప్రభుత్వ పథకం మరొకటి లేదని, అందుకే చంద్రన్న భీమాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపించేందుకు గానే ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని అచ్చెన్నాయుడు వివరించారు.
ఇదే సందర్బంగా భీమా గురించి వివరిస్తూ.. 'చంద్రన్న భీమా' కింద భీమా నమోదు చేయించుకున్న వ్యక్తులు.. ఏ కారణం చేతనైనా చనిపోతే.. సంబంధిత సంఘానికి సమాచారం అందిన 48గం.ల్లో రూ.5 వేలు అందజేస్తామని, ఆ తర్వాత నెలరోజుల్లోగా మిగిలిన రూ.4.95 లక్షలు బాధిత కుటుంబానికి అందుతాయని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రన్న భీమా పథకంలో సభ్యులుగా చేరడానికి ఆధార్ కార్డు అవసరం లేదని తెలియజేశారు.