బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు చిరంజీవి: ఆపరేషన్ సక్సెస్
దాదాపు పదకొండు గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు,చిరంజీవిగా బాలుడు బయటకు రావడంతో ఊ పిరి పీల్చుకున్నారు.
గుంటూరు: దాదాపు పదకొండు గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు,చిరంజీవిగా బాలుడు బయటకు రావడంతో ఊ పిరి పీల్చుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు బాలుడ్ని చూ డగానే ఒక్క సారిగా ఈలలు, చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆపరేషన్ చివరివరకు ఘటనా స్థలం లొనే ఉండి పర్యవేక్షించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,ఎమ్ ఎల్ ఏ జి వి ఆంజనేయులు,కలెక్టర్ కోన శశిధర్ ,రూరల్ ఎస్పీ వెంకటప్పల నాయుడు,అధికారులు.ఎట్టకేలకు అర్ధరాత్రి 2:45 నిమిషాల ప్రాంతం లో చిన్నారి చంద్రశేఖర్ నవ్వుతూ బోరు బావి నుండి బయటపడ్డాడు.
మంగళవారం సాయంత్రం వినుకొండ మండలం ముమ్మడివరం లో తల్లి తో ఆడుకుంటూ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ ఒక్కసారిగా బోరుబావిలో పడిపోయాడు. తల్లి చూస్తుండగానే, బోరు బావిలో పడిపోయిన చిన్నారి చందు ను కాపాడే ప్రయత్నం చేసింది తల్లి అనూష. అప్పటికే 20 అడుగులలోపు బోరు లో చిక్కుకున్న చిన్నారి చందు పరిస్థితి చూసి ఆ తల్లి దండ్రుల మనసు వేదనకు గురయింది.
20 అడుగుల లోతు బోరుబావిలో..
మంగళవారం సాయంత్రం నుండి మొదలు పెట్టిన సహాయక చర్యల్లో 11 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ 20 అడుగుల పైగా బోరు ప్రక్కనే సమాంతరం గా గొయ్యి త్రవ్వి పిల్లాడు ఎక్కడున్నాడు అనేది స్పష్టం గా తెలుసుకున్న సహాయక బృందాలు బోరు 20 అడుగుల వద్ద ప్లేట్స్ అమర్చి క్రింది నుండి బోరు ను పైకి త్రవ్వి బాలుడిని రక్షించారు. బాలుడిని కాపాడిన మరుక్షణం ఆ ప్రాంతమంతా ఎక్కడా లేని ఆనందం ప్రతిఒక్కరి మొహంలో కనిపించింది.
తల్లికి అప్పగించారు....
చిన్నారి చందుకు 108 సిబ్బంది ప్రాధమిక చికిత్స అనంతరం బాలుడిని తల్లి అనూషకు అప్పగించారు. తల్లి తన బిడ్డని మరలా చూస్తామో లేదో అనుకున్నామని నా బిడ్డను కాపాడిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపింది. బాబు ఆరోగ్యం గా ఉన్నాడు. మృత్యువు ని జయించిన చందు చక్కగా ఆడుకుంటున్నాడు.
11 గంటలకుపైగా ఆపరేషన్...
11 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. గ్రామానికి చెందిన అనూష తన రెండేళ్ల కుమారుడు చంద్రశేఖర్తోపాటు తమ పశువుల కొట్టం వద్దకు వెళ్లింది. చిన్నారిని కొట్టంలో ఉంచి... తాను పశువుల కోసం మేత కోసేందుకు పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లింది. ఇంతలో చంద్రశేఖర్ ఆడుకుంటూ బయటికి వచ్చాడు. అక్కడ. తెరిచి ఉన్న బోరులోకి పడిపోయాడు. అదే సమయంలో గట్టిగా కేకలు వేయడంతో తల్లి అనూష గమనించింది. పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. అయితే అప్పటికే చంద్రశేఖర్ బోరుబావిలోకి జారిపోయాడు.
నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ...
బాలుడు బోరుబావిలో పడిన సమాచారాన్ని భర్త మల్లికార్జునకు తెలిపింది. ఆ తర్వాత పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. లోపల ఉన్న బాలుడికి నింతరం ఆక్సిజన్ అందించారు. కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అప్పలనాయుడు నేతృత్వంలో బాలుడిని వెలికి తీసే చర్యలు చేపట్టారు. బోరు బావిలో 13 అడుగుల లోతున బాలుడు ఉన్నట్లు గుర్తించారు. ప్రొక్లయిన్ల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. మధ్యలో సున్నపురాయి పడటం సహాయక చర్యల్లో కొంత ఆలస్యం జరిగింది.
ఎస్పీ, మంత్రి, ఎమ్మెల్యే...
ఎస్పీ అప్పలనాయుడుతాడు సహాయంతో స్వయంగా గోతిలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా సంఘటన స్థలంలోనే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 10.15 గంటల సమయంలో చిన్నగా వర్షం మొదలుకావడంతో సహాయ చర్యలకు స్వల్ప ఇబ్బంది తలెత్తింది. వర్షంలోనూ ఆయా శాఖల సిబ్బంది సమన్వయంతో సహాయ చర్యలు కొనసాగించారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి. బోరుబావిలో ఉన్న బాలుడి కదలికలను గమనిస్తూ వచ్చారు.తెల్లవారుజామున 2:40 నిమిషాలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.