అనారోగ్య సమస్యలతో.. పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
కడప/ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవచ్చాయి. పిల్లల అనారోగ్య సమస్యలే ఆ కుటుంబాన్ని కకావికలం చేశాయి. క్షీణిస్తోన్న పిల్లల ఆరోగ్యాలు ఎంతకీ మెరుగవకపోవడంతో.. చావే శరణ్యమని భావించిన చంద్రశేఖర్ రెడ్డి కూల్ డ్రింక్ లో విషం కలిపి పిల్లలతో పాటు తాను సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు.
అనంతరం విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురూ మృతి చెందారు. మృతుడు జంపాల చంద్రశేఖర్రెడ్డి (47)స్థానిక నాగేంద్రనగర్ లో నివాసముంటూ కమీషన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
కాగా, చంద్రశేఖర్ రెడ్డికి 19 ఏళ్ల క్రితం తన అక్క కూతురు రమాదేవితో వివాహమైంది. వీరికి మంజునాధరెడ్డి, హన్షికలు అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇద్దరు పిల్లలను పుట్టుక నుంచే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిల్లల ఆరోగ్యం మెరుగుపడాలని ఐదేళ్ల క్రితం రమాదేవి తన ఇద్దరు పిల్లలను హైదరాబాదులోని ఓప్రైవేట్ హాస్పిటల్లో చూపించింది.
పిల్లల వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని అక్కడి వైద్యులు నిర్దారించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమాదేవి పిల్లలతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఘటనలో రమాదేవి మృతి చెందగా, పిల్లలిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రస్తుతం పెద్దవాడైన మంజునాధరెడ్డి (17) ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. చిన్నదైన హన్షిక (9) మూడో తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే భార్య రమాదేవి చనిపోయాక చంద్రశేఖర్రెడ్డి మరో వివాహం చేసుకున్నాడు. రమాదేవి చనిపోయిన ఏడాదికి ముద్దనూరు మండలం కొట్టాలపల్లికి చెందిన కవితను రెండవ వివాహం చేసుకోగా.. విఘ్నేష్రెడ్డి అనే కుమారుడు జన్మించాడు.
అందరూ కలిసి నాగేంద్రనగర్ లోనే నివాసముంటూ వస్తున్నారు. అయితే మొదటి భార్యను మరిచిపోలేక.. పిల్లల అనారోగ్యం క్షీణిస్తుంటే ఏమి చేయలేక చంద్రశేఖర్రెడ్డి తీవ్రంగా బాధపడుతుండేవాడు. పలుమార్లు మిత్రులు, సన్నిహితుల వద్ద కూడా తన అవేదను వ్యక్తం చేశాడు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడడంతో ఆత్మహత్య దిక్కు అన్న నిర్ణయానికి వచ్చాడు.
మొదటి భార్య రమాదేవి తీసుకున్న నిర్ణయమే తాను తీసుకోవాలని భావించాడు. ఆత్మహత్య ద్వారా తాను భార్య చెంతకు చేరుకోవాలని, పిల్లలను కూడా తల్లి దగ్గరకు చేర్చాలనుకున్నాడు. ఇదే క్రమంలో గురువారం మధ్యాహ్నం కొడుకు మంజునాధరెడ్డి, కూతురు హన్షికను తీసుకుని బైక్ పై వెళ్లి సంబటూరు గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు వెళ్లాడు. అక్కడే పిల్లలిద్దరికీ విషరసాయనం కలిపిన కూల్ డ్రింక్ తాగించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కూడా అదే కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కాగా, ఆత్మహత్యాయత్నం అనంతరం.. ముగ్గురు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ప్రొద్టుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎర్రగుంట్ల సీఐ రాజేంద్రప్రసాద్, కమలాపురం ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విషయంపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
భర్త ఆస్తిలో వాటా ఇచ్చి ఆదుకోండి :
చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్యతో ఆయన రెండో భార్య జంపాల కవిత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తనకు ఓ కుమారుడు ఉండడంతో చంద్రశేఖర్ రెడ్డి ఆస్తిలో తనకు సగం వాటా ఇవ్వాలనికవిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త బంధువైన శివారెడ్డి ఉంటున్న గోకుల్ అపార్టుమెంట్ ముందు శుక్రవారం సాయంత్రం భర్త, పిల్లల మృతదేహాలతో కవిత ఆందోళన చేసింది.
కాగా, భర్తకు సంబంధించిన 32 సెంట్ల భూమి, రూ.10 లక్షల నగదు, 50 తులాల బంగారు నగలు చంద్రశేఖర్ రెడ్డికి బాబాయ్ అయిన శివారెడ్డి వద్ద ఉన్నాయని, అందులో సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది కవిత. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, త్రీటౌన్ ఎస్ఐ మహేష్ అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. చంద్ర శేఖర్ పేరు మీదున్న స్థలాన్ని కవితకు ఇచ్చేలా శివారెడ్డి ఒప్పుకోవడంతో ఆందోళన సర్దుమణిగింది.