బాధపడితే పోరాడలేము.. పోరాడేవారు బాధపడరాదు .. పార్టీ నాయకులకు చంద్రోపదేశం
ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై దిక్కు తోచని స్థితిలో ఉన్న చంద్రబాబు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసే పనిలో పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకునే యత్నం చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. ఎవరూ బాధ పడొద్దని , ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే పార్టీ తమదని ఆయన పార్టీ శ్రేణుల్లో కాస్త ధైర్యం నూరిపోస్తున్నారు. మొన్నటికిమొన్న జగన్ మీద సానుభూతే గెలిపించిందని , టీడీపీ మీద ప్రజల్లో కోపం లేదని చెప్పిన బాబు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. కానీ చాలా మంది చంద్రబాబు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు.
చంద్రబాబు ఆఫర్ తిరస్కరించిన ఎంపీ కేశినేని నాని ... ఆ పదవి అక్కర్లేదని పోస్ట్
కేంద్రం మీద పోరాటం ఆపేది లేదంటున్న చంద్రబాబు .. కష్టాలు ఎన్ని ఎదురైనా పోరాటం చెయ్యాల్సిందే
చంద్రబాబు తాను కేంద్రం మీద సాగిస్తున్న పోరును ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు ఇలాంటి కష్ట సమయంలోనే ధైర్యంగా అడుగు వెయ్యాలని సూచిస్తున్నారు. కేంద్ర సర్కార్ మీద ప్రత్యేక హోదా కోసం పోరు సాగించాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. తాజాగా టీడీపీ తమ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ను ఎంపిక చేసింది. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సుజనా చౌదరి, లోక్ సభాపక్ష నేతగా రామ్మోహన్ రావుకు అవకాశం కల్పించింది. సంఖ్యాబలం ఎంతున్నా సరే పోరాటం మాత్రం ఆపకూడదని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని లోక్ సభా నియోజక వర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి . ఈ నేపధ్యంలో పార్టీని బలోపేతం చెయ్యటానికి లోక్ సభా నియోజక వర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు.
బాధపడితే పోరాడలేము.. పోరాడే వారు బాధపడరాదు అంటూ చంద్రోపదేశం
ఉండవల్లిలోని స్వగృహంలో పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు అలుపెరుగని పోరాటం చెయ్యాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. అంతే కాకుండా బాధపడితే పోరాడలేము.. పోరాడే వారు బాధపడరాదు అంటూ చంద్రబాబు పార్టీ నేతలకు చంద్రోపదేశం చేశారు. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలతో పార్లమెంట్ లో ముగ్గురు ఎంపీలతో చంద్రబాబు పోరాటం సాగించటానికి సిద్ధం అవుతున్నారు. అయితే చంద్రబాబు టార్గెట్ గా అటు కేంద్ర సర్కార్, ఇటు రాష్ట్ర సర్కార్, మరో పక్క పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ డేగ కళ్ళతో చూస్తున్న వేళ చంద్రబాబు పార్టీ నాయకులను కాపాడుకుంటారా ? పార్టీని ముందుకు నడిపిస్తారా ?
పార్టీ నాయకుల అలకలు , టీడీపీని నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చంద్రబాబు చేదిస్తారా?
ఇప్పటికే పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరైన కేశినేని నానీ అలకబూనారు. పార్టీ ఆరే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మరో పక్క తెలంగాణాలోని టీడీపీ ముఖ్య నాయకులు తాజాగా బీజేపీ అధినాయలను మీట్ అయ్యారు. ఇక టీడీపీ నేతలకు వల వెయ్యటానికి భవిష్యత్ లో టీడీపీ లేకుండా చెయ్యటానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్తున్న ధైర్య వచనాలు ఏ మేరకు పార్టీ కి లాభం చేకూరుస్తాయో. చంద్రోపదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తుందో లేదో వేచి చూడాలి.