జగన్ గెలుపుపై డౌట్ వచ్చిందా.. సెంటిమెంట్ గుర్తొచ్చిందా ? కేటీఆర్ స్వరం ఎందుకు మారింది ?
ఏపిలో జగన్ సీఎం అవ్వటం ఖాయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజల క్రితం వరకూ చాలా గట్టిగా చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా కేటీఆర్ ఏపి సీఎం ఎవరు అనే విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. ఏపి సీఎంగా జగన్ అంటూ ఆయన గురించి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ లౌక్యంగా తప్పించుకొనే ప్రయత్నం చేసారు. దీని వెనుక అసలు కారణమేంటి..
కేటీఆర్ స్వరం మారిందా..
టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆస్క్ కేటీఆర్ అనే కార్యాక్రమంలో నెటిజెన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఏపి రాజకీయాల గురించి ప్రశ్నలు వచ్చాయి. వాటికి సైతం కేటీఆర్ స్పందించారు. ఏపీ సీఎం పదవికి జగన్ సరిపోతాయరని మీరు భావిస్తున్నారా అని నెటిజెన్లు కేటీఆర్ను ప్రశ్నించారు. దీనికి స్పందనగా అక్కడి సీఎం ఎవరనేది అక్కడి ప్రజలే నిర్ణయిస్తారు. అందులో నా అభిప్రాయం ఎందుకు. అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. అయినా ఏపీ రాజకీయాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదని సమాధానం ఇచ్చారు. అయితే, ఎపీలో ఎన్నికల సమయంలోనూ..ఆ తరువాతకేటీఆర్..కేసీఆర్ ఇద్దరూ ఏపిలో జగన్ సీఎం కావటం ఖాయమని చెబుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు కేటీఆర్ స్వరంలో ఎందుకు మార్పు వచ్చింది..జగన్ సీయం పదవికి సరిపోతారా అంటే ఎందుకు సమాధానం దాటవేసారనేదే ఇప్పుడు చర్చ..
2004 ఎఫెక్ట్ కారణమా..
ఏపిలో ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని..జగన్ సీయం అవుతారంటూ కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఏపిలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ సైతం వ్యాఖ్యానించారు. ఇక, ఏపి ఎన్నికల ప్రచారంలో ఏపి సీయం చంద్రబాబు సైతం కేసీఆర్ లక్ష్యంగా అనేక విమర్శలు చేసారు. జగన్కు వేయి కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అయితే, దీనికి సమాధానంగా కేసీఆర్ తన ఎన్నికల ప్రచార సభలో తాము ఏపికి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని .. చంద్రబాబు ఓడిపోతారనే ఆవేదనతో మాట్లాడుతున్నారని..తన వద్ద చాలా సర్వేలు ఉన్నాయి..అవి జగన్ గెలుపు ఖాయమని చెప్పారు. అయితే, ఇప్పుడు మాత్రం ఎందుకో మౌనం పాటిస్తున్నారు. 2014 ఎన్నికలు పూర్తయిన సమయం లో సైతం ఏపిలో జగన్ సీయం అవుతారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు మాత్రం టిడిపికి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు సైతం ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ జాగ్రత్తలో భాగంగానే ఈ రకంగా వ్యవమరించారనే వాదన వివిపిస్తోంది.
కేసీఆర్కు ఏకైక మద్దతు దారుడు జగన్..
జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసినా.. పూర్తి స్థాయి మద్దతు మాత్రం లభించలేదు. ఇక, కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ స్వయంగా జగన్ వద్దకు వెళ్లి ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ సైతం సానుకూలంగా స్పందించారు. ఏపి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఒకవైపు కేసీఆర్ను విమర్శిస్తుంటే..ఏపికి ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్న కేసీఆర్తో స్నేహంగా ఉండాల్సిన అవసరం ఉందని జగన్ చెబుతూ వచ్చారు. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ మౌనంగా ఉండాలని రెండు పార్టీల నేతలూ భావిస్తున్నారా..అందులో భాగంగానే ఈ రకంగా కేటీఆర్ స్పందించారా..లేక , ఏపి ఎన్నికల గురించి కేటీఆర్ అంచనాలు ఏమైన మారాయా..ఇలా..రక రకాలుగా కేటీఆర్ సమాధానం తరువాత విశ్లేషణలు మొదలయ్యాయి. వీటికి సమాధానం మే 23 తరువాత మాత్రమే లభించే అవకాశం ఉంది.