ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు .. రాజధాని మార్పు వదంతులకు చెక్
ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. అందులో భాగంగానే రాజధాని నిర్మాణం పై దృష్టిసారించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో బిజీగా ఉంది ఏపీ సర్కార్. కొత్త మాస్టర్ ప్లాన్ కోసం సీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ లో పలు మార్పులు చేయాలనుకుంటుంది. నిన్న మొన్నటి వరకు రాజధాని తరలింపు జరుగుతుంది అని , దొనకొండలో రాజధాని ఏర్పాటు కానుందని ప్రచారం జోరుగా జరిగింది. అందుకు ఏపీ మంత్రుల వ్యాఖ్యలు కూడా కారణం అయ్యాయి.
అమీర్పేట్ టు అమరావతి: జగన్ ప్రకటనతో సీన్ రివర్స్ ...ఏం జరుగుతోంది?
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్ నిర్ణయం
ఇక ఊహించని విధంగా చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్ . ఏపీ రాజధాని నిర్మాణానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి సింగపూర్ ప్లాన్ తో నిర్మాణం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు అంతర్జాతీయంగా ఏపీ రాజధానికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో రాజధాని పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి ఇక ఏపీ మంత్రులు సైతం రాజధాని భూసేకరణలో అవినీతి జరిగిందని, అది తేలిన తర్వాతే రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పి పనులను నిలుపుదల చేయించారు.
మంత్రుల వ్యాఖ్యలతో రాజధాని నిర్మాణంపై కమ్ముకున్న నీలినీడలు
అంతేకాదు వర్షం పడితే వరద ముంపునకు గురవుతుందని , ఏపీ రాజధాని సురక్షిత ప్రాంతం కాదని సాక్షాత్తు మున్సిపల్ శాఖా మంత్రి ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. అమరావతిని మారుస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజధాని రైతులు లబోదిబోమన్నారు. ఇక అమరావతి నిర్మాణం అంతే సంగతి అని అంతా భావించారు. అయితే ఏపీ సర్కార్ మాత్రం అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త ప్రణాళికలు తయారు చేసే పనిలో పడిన సీఆర్డీఏ అధికారులు నిర్మాణ పనులను చేపట్టే ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పకనే చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ప్లాన్ సిద్ధం చేసిన సీఆర్డీఏ
ఇక కొత్త ప్రణాళికలో భాగంగా 25 అంతస్తుల నిర్మాణాలకు బదులు 10 అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. భారీ బడ్జెట్ తో సంబంధం లేకుండా దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకుని సీఆర్డీఏ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సచివాలయం పాత ప్లాన్ లోని ఐదు టవర్లకు బదులు రెండు టవర్లు నిర్మాణం మాత్రమే చేయాలనుకుంటున్నారు. 2022-23 నాటికి మొదటి దశలో 3,4వ టవర్ల పూర్తికి 3 వేల 132 కోట్ల వ్యయం అంచనా వేశారు సీఆర్డీఏ అధికారులు.
మరోమారు రాజధాని నిర్మాణంపై చర్చ
ఇప్పటికే టవర్ల నిర్మాణం కోసం రూ. 332కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 2,800కోట్లు అవసరం అవుతోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 321కోట్లు విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఇక సచివాలయం ప్లాన్ లో భాగంగా రెండు టవర్ల నిర్మాణం చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక వనరులను బట్టి ప్రభుత్వ ప్రతిపాదన కు తగ్గట్టుగా సీఆర్డీఏ ఏపీ రాజధాని నిర్మాణానికి కొత్త ప్లాన్ సిద్ధం చేయడంతో రాజధాని నిర్మాణం పై మరోమారు ఏపీలో చర్చ జరుగుతోంది.