టెన్త్ పరీక్షల్లో మార్పులు..! విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యం అంటున్న అదికారులు..!!
అమరావతి/హైదరాబాద్ : పదవ తరగతి విద్యార్తుల ఫైనల్ పరీక్షా విధానాన్ని ఏపి ఎస్సెస్సీ బోర్డ్ సమూలంగా మార్చివేయ బోతోంది. ఈ మార్పులతో విద్యార్థులు మార్కులను ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుందని బోర్డ్ అదికారులు భావిస్తున్నారు. విద్యార్ధులు సమయాభావంతో ఆందోళన పడటం వల్ల కొంత నష్టపోతున్నారని, అది దృష్టిలో ఉంచుకుని సమాయాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది. రాబోవు పరీక్షల్లో విద్యార్థుల వెసులు బాటు కోసం పరీక్షా పేపర్లను మొత్తం నాలుగు విభాగాలుగా విభజించినట్టు సమాచారం. పదవ తరగతి పరీక్షల్లో తీసుకొస్తున్న సమూల మార్పుల వల్ల మాస్ కాపీయింగ్ అరికట్టడంతో పాటు, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందడానికి ఉపయోగ పడుతుందని అదికారులు స్పష్టం చేస్తున్నారు.
మాస్ కాపీయింగ్ కు చెక్..! టెన్త్ పరీక్షల్లో భారీ మార్పులు..!!
రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంలో భారీగా మార్పులు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షల విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. బిట్ పేపర్ రద్దు, సమయం పెంపు, పేపర్ల వారీగా విడిగా పాస్ మార్కులు, పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విభజించడం వంటి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరీక్ష విధానం ద్వారా సబ్జెక్టుకు 35 మార్కుల వస్తే చాలు కానీ పరీక్షల్లో కొత్త విధానాన్ని తీసుకురావడంతో ఈ పద్ధతికి స్వస్తి పలకనున్నారు. విద్యార్థులు 100 మార్కులకు (50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రతి పేపర్లో పది మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో బిట్ పేపర్ ఉండేది. ఇప్పుడు బిట్ పేపర్ రద్దుతో వాటి స్థానంలో అర మార్కు ప్రశ్నలు ఇవ్వాలని ప్రతిపాదించారు.
సమయం పెంపు..! విద్యార్థుల వెసులుబాటు కోసమే..!!
హిందీలో వంద మార్కులు మినహాయించి పేపర్కు 40మార్కులు చొప్పున 2పేపర్లు కలిపి 80మార్కులకు ఉండగా ఇంటర్నల్ మార్కులు 20ఉండేవి. వాటిలో మార్పులు చేస్తూ పేపర్కు 50మార్కులు చొప్పున మార్పులు చేశారు. మార్కులు, ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్ష సమయాన్ని సైతం మార్పులు చేయనున్నారు. హిందీ, సంస్కృతం తప్పించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఉంటుంది. హిందీ, సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు.
బిట్ పేపర్ ఉండదు..! పేపర్ల వారీగా విడిగా పాస్ మార్కులు..!!
పరీక్షల్లో బిట్ పేపర్ వల్ల మాస్ కాపీయింగ్ బాగా జరుగుతోందని వస్తున్న సమాచారం వల్ల ఈ మార్పులు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బిట్ పేపర్ రద్దు చేయాలని నిర్ణయించారు. బిట్ పేపర్ స్థానంలో అర మార్కు ప్రశ్నలు ఇవ్వనున్నారు. వీటిని విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. ఇప్పటివరకు పదో తరగతిలో సబ్జెక్టుల్లోని రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వస్తే చాలు పాస్ చేసేవారు. ఇక నుంచి అలా ఉండదు సబ్జెక్ట్ లోని రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ పాస్ అవ్వాలని తెలిపారు. దీని ప్రకారం ప్రతి పేపర్లోనూ 17.5 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తేనే పాసైనట్లు అని తెలిపారు. పాత విధానంలో ఒక పేపర్లో 35 మార్కులు వచ్చి, రెండో దానిలో సున్నా వచ్చినా పాసవుతున్నారు. దీనివల్ల టీచర్లలో ఎవరు బాగా పాఠాలు చెబుతున్నారు.. ఎవరు చెప్పడం లేదు అనే విషయాలు తెలియడం లేదు. అందుకే ఇలా మార్పులు చేశారని తెలుస్తోంది.
నాలుగు సెక్షన్లుగా ప్రశ్నపత్రం..! మార్కులు ఎక్కువ పొందే అవకాశం..!!
కాగా పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విడదీస్తారు. ఒక్కో పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఇవ్వనున్నారో ప్రశ్నపత్రం, బ్లూప్రింట్ను కూడా రూపొందించారు. ఈపాటికే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నా అనుమతి రానందున పాఠశాలలకు పంపలేదు. ఒక్కో పేపర్ 50 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా ప్రశ్నలు ఇస్తారు. అర మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి 6 మార్కులు కేటాయించారు. బిట్ పేపర్కు బదులుగా దీన్ని పెడుతున్నారు. ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వీటికి కనీసం రెండు లైన్ల జవాబు రాయాలి. వీటికి 8 మార్కులు ఉంటాయి. రెండు మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. మూడు, నాలుగు లైన్లలో జవాబు రాయాలి. వీటికి 16 మార్కులు కేటాయించారు. పెద్ద ప్రశ్నలు 5 ఉంటాయి. వీటికి ఎనిమిది నుంచి పది లైన్లలో జవాబు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయించారు. ఇలా చేయడం ద్వారా మాస్ కాపీయింగ్ ను నివారించొచ్చని అదికారులు స్పష్టం చేస్తున్నారు.