విరామంలోనే పవన్ కళ్యాణ్...షెడ్యూల్ ఇది:అభిమానుల పడిగాపులు
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్కల్యాణ్ పోరాట యాత్రలో విరామం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా పర్యటన ముగించుకొని శనివారం రాత్రికే అరకులోయ చేరుకున్న పవన్ అక్కడ ఒక రిసార్ట్లో బస చేశారు.
ఆదివారం ఉదయం పవన్ తన యాత్ర కొనసాగిస్తారని అభిమానులు ఎదురుచూడగా పవన్ బ్రేక్ తీసుకున్నారు. అంతేకాదు గత రెండు రోజులుగా పవన్ అదే రిసార్ట్ లో ఉంటూ అభిమానులతో,పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. అయితే సోమవారం గిరిజనులతో పవన్ సమావేశం అవ్వాల్సి ఉండగా వర్షం కారణంగా ఆ కార్యక్రమం రద్దయ్యింది. అయితే అనుకోని విరామం నేపథ్యంలో పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ పర్యటన షెడ్యూల్ ఇలా ఉండొచ్చని తెలిసింది.
పవన్ యాత్ర...తాజా షెడ్యూల్?
జనసేన పార్టీ వర్గాల సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఇలా సాగే అవకాశం ఉంది...ఈ నెల 6 వ తేదీ బుధవారం అరకులోయ నుంచి పవన్ యాత్ర ప్రారంభించి, అక్కడ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాడేరు వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ తో అక్కడ కవాతు నిర్వహిస్తారు. అదేరోజు ఘాట్ రోడ్డు మీదుగా కిందికి దిగి మాడుగులలో పోరాటయాత్ర నిర్వహిస్తారు. 7వ తేదీన నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలిలో పవన్ యాత్ర కొనసాగుతుంది. 8వ తేదీన చోడవరం, అనకాపల్లి, పెందుర్తిల్లో పర్యటిస్తారు.
ఆ తర్వాత...విశాఖ నగరంలోకి...
ఈ విధంగా జిల్లాలో పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ విశాఖ నగరంలో అడుగుపెడతారని తెలిసింది. అయితే పార్టీ వర్గాలు పవన్ పర్యటనకు సంబంధించి ఇంతవరకు మాత్రమే వివరాలు వెల్లడించగలిగారు. పైగా పవన్ ఎక్కడ బస చేస్తారనే విషయం చెప్పలేకపోయారు. అభిమానుల తాకిడి కారణంగా పవన్ బస విషయం రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ షెడ్యూల్ ను జనసేన వర్గాలు అధికారికంగా విడుదల చేయనందున దీన్ని తాత్కాలిక షెడ్యూల్ గా భావించవచ్చని...మరలా ఇందులో మార్పులు,చేర్పులు వుండవచ్చని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
Recommended Video
పవన్ కు...అభిమానుల తాకిడి
మరోవైపు పవన్ అరకులోయలో అడుగుపెట్టింది మొదలు ఆయనను చూసేందుకు బస వద్దకు భారీగా తరలివస్తున్న అభిమానులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సోమవారం అలా ఉదయం నుంచీ నిరీక్షించిన అభిమానులకు సాయంత్రం ఆరున్నర సమయంలో పవన్కల్యాణ్ దర్శనభాగ్యం దక్కింది. తొలుత పాడేరు...అరకులోయ...పెదబయలు...ఇలా గిరిజన ప్రాంతాలకు చెందిన అభిమానులతో పవన్ భేటీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయగా అనూహ్యంగా కురిసిన వర్షం కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనుకాగా వర్షం తగ్గినా ఇంకా అభిమానులు వెళ్లకుండా వేచిచూస్తున్నారని తెలిసి పవన్ కల్యాణ్, రిసార్ట్స్ మెయిన్ గేటు వద్దకు వచ్చి అభిమానులను కుశల ప్రశ్నలు అడిగారు. ఫ్యాన్స్ తో పాటు పర్యాటకులతో సెల్ఫీలు దిగి...ఆ తరువాత లోపలికి వెళ్లిపోయారు.
పవన్ పై...విమర్శలు...
అయితే పవన్ కళ్యాణ్ తీరు ఆయనకు నష్టం చేకూర్చేలా ఉందని రాజకీయనేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పవన్ యాత్రలో ఆయనను కలిసేందుకు, పార్టీలో చేరేందుకు వస్తున్న కొందరు రాజకీయ నేతలకు పవన్ అపాయింట్ మెంట్ కూడా లభించడంలేదని ప్రచారం జరుగుతోంది. తాజాగా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పవన్ కళ్యాణ్ను కలిసేందుకు రాగా ఈయనను పవన్ లోపలికే అనుమతించ లేదని అంటున్నారు. దీంతో ఆయన పవన్ పీఏతో మాట్లాడి, తిరిగి వెళ్లిపోయారంటున్నారు. ఈ పరిణామంపై జనసేనలో చేరాలనే ఆసక్తి ఉన్న రాజకీయ నేతలకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. కనీసం పవన్ సీనియర్ నేతల పట్ల ఎలా మెలగాలో కూడా తెలుసుకోకపోతే పార్టీ ఎలా పటిష్టపరుచుకోగలరని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.