తిరుమలలో చంద్రబాబు కీలక ప్రకటనలు: 21 ఏళ్ల తర్వాత అక్కడకు, భువనేశ్వరి వల్లే అంటూ
Recommended Video
చిత్తూరు: త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని మార్చనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఇతర మతాలపై విశ్వాసం ఉన్నవారిని టీటీడీలో నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. హిందూ ధర్మం ప్రకారమే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని తెలిపారు. టీటీడీ పవిత్రతను కాపాడుతాని ముఖ్యమంత్రి తెలిపారు.
చంద్రబాబు వెంట బాలకృష్ణ, లోకేష్
ఈ సంక్రాంతి ప్రజలందరికీ సిరి సంపదలను ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్టు చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు వెంట వెంట నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఐటీ మంత్రి నారా లోకేష్ తదితరులు ఉన్నారు.
21 ఏళ్ల తర్వాత హెరిటేజ్కు చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో గల హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఆయన ఫ్యాక్టరీని సందర్శించారు. ఇంధన పొదుపులో జాతీయ అవార్డు సాధనకు కృషి చేసిన హెరిటేజ్ ఉద్యోగులను ఆయన అభినందించారు.
సామాజిక బాధ్యతతో పని చేస్తే అవార్డులు
హెరిటేజ్ను సందర్శించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తన సతీమణి భువనేశ్వరి వల్లే హెరిటేజ్ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సామాజిక బాధ్యతతో కష్టపడి పని చేస్తే అవార్డులు వస్తాయని ఆయన అన్నారు.
చెన్నై తరహా ముప్పు లేదు
ఆయన శనివారం తిరుపతిలో పర్యటించారు. జోహో కార్పోరేషన్ సాఫ్టువేర్ కంపెనీ తిరుపతిని అతిపెద్ద ఐటీ సెంటరుగా రూపొందించాలని ఆ కంపెనీ ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. తిరుపతిలో ఐటీ రంగానికి జోహో పునాదులు కావాలన్నారు. దీనికి ఎంత స్థలమైనా, ఎక్కడైనా ఆరు నెలల్లో అనుమతులు ఇస్తామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్తో పాటు చెన్నై, బెంగళూరు, కడప ప్రాంతాలకు రోడ్ కనెక్టీవిటీ ఉందన్నారు. బెంగళూరు పెద్ద సిటీ కావడం, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉన్నాయని, చెన్నై తరహాలో తిరుపతికి వరదల వల్ల ముప్పులేదన్నారు. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్పై చంద్రబాబు చమత్కారం
అన్నింటికీ మించి తిరుమల బాలాజీ స్వామి ఇక్కడే ఉన్నారని చంద్రబాబు అన్నారు. . ఇక్కడి యువతపై, నాలెడ్జిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఆంగ్ల భాషతో పాటు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ఉందని వివరించే క్రమంలో.. కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ను బ్రిటిషర్లు ఇక్కడే వదిలేశారని చంద్రబాబు చమత్కరించారు. ప్రపంచానికి జీరోను పరిచయం చేసిన ఘనత భారత్ దే అన్నారు. జోహో ఐటీ సెంటర్ విస్తరణకు తిరుపతి ఒక్కటే బెస్ట్ అండ్ సేఫ్ ప్లేస్ అన్నారు.