ట్విస్ట్-కేవీపీదీ మనీ బిల్లా?: హోదాపై రాజ్యసభకు అధికారం లేదని జైట్లీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు మంగళవారం నాడు కూడా రాజ్యసభలో గందరగోళం సృష్టించింది. ఉదయం నుంచి సభ పలుమార్లు వాయిదా పడింది.
మరోవైపు విపక్ష సభ్యులు బిల్లు పైన చర్చ, ఓటింగు కోసం పట్టుబడుతున్నారు. వెల్లోకి దూసుకెళ్లి వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేశారు. బిల్లు పైన చర్చకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని రాజ్యసభ చైర్మన్ కురియన్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభను పదేపదే అడ్డుకుంటుండంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రత్యేక హోదా, ఏపీ పైన ఎప్పుడైనా చర్చకు సిద్దమని చెప్పారు. ఏపీకి ఏం చేయాలో మీరు చెప్పాలని నిలదీశారు. మనీ బిల్లును స్పీకర్ అనుమతితో లోకసభలో ప్రవేశ పెట్టాలన్నారు.
కేవీపీ ప్రవేశ పెట్టింది ద్రవ్య బిల్లు కాబట్టి ఈ సభలో ప్రవేశ పెట్టడం కుదరదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు బడ్జెట్ బిల్లు అని చెప్పారు. రాజ్యసభకు చర్చించే అధికారం లేదన్నారు. ఇది రాజ్యాంగంలో ఉందని చెప్పారు. ఓటింగ్కు పట్టుబట్టడం సరికాదన్నారు.
డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ.. అది ద్రవ్య వినిమియ బిల్లు అయినందున చర్చించే అధికారం రాజ్యసభకు లేదన్నారు.
దీనిపై కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఏపీకి హోదా బిల్లు ఆయన చెబుతున్నట్లు ద్రవ్య బిల్లు అయితే డిప్యూటీ చైర్మన్ బిల్లును ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. గత ప్రధాని ఇదే వేదిక పైన ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారని, దీనిపై తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు బిల్లును మనీ బిల్లుగా ఎలా చెబుతారన్నారు.
దీనిపై కురియన్ స్పందిస్తూ.. చర్చను విన్న తర్వాత అది ద్రవ్యబిల్లా, కాదా అన్న విషయాన్ని ఆఫీస్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ రోజు ఈ బిల్లుపై చర్చకు అంగీకారం లేదన్నారు. ఈ శుక్రవారం చర్చకు అనుమతిస్తామని చెప్పారు. అయినప్పటికీ సభలో గందరగోళం ఆగలేదు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.