కేసీఆర్లా లేకనే: గందరగోళం, వెళ్లిపోయిన మహిళలు
హైదరాబాద్: గాంధీ భవనంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఓటమి పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. తమ పేర్లను ఆఫీస్ బేరర్ల నుండి తొలగించారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న తమ పేర్లను తొలగించి, పార్టీలో లేని వారి పేర్లను ఉంచారని వారు నిరసన తెలిపారు.
దీనిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను నిలదీశారు. అయితే, ఆ విషయం తనకు తెలియదని ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పొన్నాల మాట్లాడుతుండగా కొందరు లేచి నిరసన తెలిపారు. తాము పార్టీలో ఉండబోమన్నారు. తోపులాట చోటు చేసుకుంది. గందరగోళం చోటు చేసుకోవడంతో మహిళా ఎమ్మెల్యేలు తాము ఉండలేమంటూ బయటకు వెళ్లిపోయారు.
అనంతరం నేతలు ఓటమి పైన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా పలువురు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. కేసీఆర్ లాంటి వాళ్లు పార్టీలో లేకపోవడం వల్లనే ఓడిపోయామని కొందరు చెప్పగా, పొన్నాల వల్లనే ఓడిపోయామని ఇంకొందరు, ఎక్కువ మంది సీఎంలు కావాలంటూ ఇంట్లో కూర్చున్నందున ఓడిపోయామని మరికొందరు, తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోయామని పొన్నాల సహా మరికొందరు చెప్పారు. పొన్నాలను తప్పించవద్దని పలువురు ఈ సమావేశంలో చెప్పారు.
కరీంనగర్ జిల్లాలో పార్టీ అధినేత్రి సోనియా సభకు ఇరవై వేల మంది ప్రజలు కూడా హాజరు కాలేదని అప్పుడే ఓటమి ఖరారయిందని కొందరు అభిప్రాయపడ్డారు. డీ శ్రీనివాస్, జానా రెడ్డి వంటి నేతలు జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి అన్నారు.