కాల్పులు జరిగాయి కాబట్టే సెక్యూరిటీ: నటుడు చలపతి
హైదరాబాద్: వీఐపీలు సంచరించే కేబీఆర్ పార్క్ వద్ద కాల్పులు జరగడంతో ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమై... పార్క్ వద్ద సెక్యూరిటీని అమాంతం పెంచేశారని ప్రముఖ నటుడు చలపతిరావు అన్నారు. గత 15 సంవత్సరాలుగా తాను కూడా ఇక్కడకు వాకింగ్ కోసం వస్తున్నానని... ఎప్పుడు కూడా సరైన సెక్యూరిటీ కూడా లేదని వాపోయారు.
ప్రతిరోజు ఎంతో మంది వీవీఐపీలు ఇక్కడకు వస్తుంటారని... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకింగ్ చేస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రోజూ వస్తారని చెప్పారు. ఇప్పటిదాకా ఎలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి సెక్యూరిటీ పెట్టలేదని అన్నారు.
ఇప్పుడు అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిగాయి కాబట్టి, ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమై... వెంటనే సెక్యూరిటీ పెట్టారని అన్నారు. ఇంతమంది వీఐపీలు వాకింగ్ చేసే చోట సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేబీఆర్ పార్క్ వద్ద సెక్యూరిటీని ఎప్పటికీ కొనసాగించాలని సూచించారు.
బుధవారం ఉదయం కేబీఆర్ పార్కులో వాకింగ్ ముగించుకుని నిత్యానందరెడ్డి, అతని సోదరుడు కారులో బయలు దేరడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఓ ఆగంతకుడు ఆకస్మాత్తుగా కారులోకి ప్రవేశించి నిత్యానందరెడ్డి పాయింట్ బ్లాక్ రేంజ్ తుపాకీ నుంచి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నామని, సహకరించకపోతే కాల్పులు జరుపుతానని హిందీలో హెచ్చరించాడు.
వెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి ఆత్మరక్షణ కోసం ఆగంతకుడి వద్ద ఉన్న గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దుండగుడితో నిత్యానందరెడ్డి అతని సోదరుడు పెనుగులాడటంతో దుండగుడి చేతులోని గన్ ఫైర్ అయ్యింది. సుమారు పది బుల్లెట్లు రిలీజ్ అవడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే కిడ్నాపర్ అక్కడి నుంచి పరారైన విషయం తెలిసిందే.