రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు: ఏ4గా బాబురావు, అరెస్ట్ చేసే అవకాశం?
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో మరికొంత మందిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు శుక్రవారం చార్జిషీటు దాఖలు చేశారు.
ఈ చార్జిషీట్లో ప్రిన్సిపాల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చారు. దీంతో త్వరలో ప్రిన్సిపాల్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హనీషా, జయ తరణ్, సాయి శ్రీనివాస్ అనే నిందితులను అరెస్టు చేయగా, 47 రోజుల తరువాత వారు బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబూరావే కీలక నిందితుడని, అతనిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు, పలు ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాబూరావును కాపాడేందుకు అధికార పార్టీ నేతలు కొంత మంది ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహారశైలిని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. బాబూరావు వల్లే యూనివర్సిటీలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్కు అతడే సహకరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై రిషితేశ్వరి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.