చత్తీస్ఘఢ్ మాజీ సీఎం కుమారుడు అరెస్ట్.. టీడీపీ ఎమ్మెల్యేల పై ఎఫెక్ట్: వీరి పైనా చర్యలు తప్పవా..!!
ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా ఏకంగా మాజీ సీఎం కుమారుడు అరెస్ట్ అయ్యారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసారు. చత్తీస్ ఘడ్ మాజీ సీఎం కుమారుడు అమిత్ జోగిని ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని రుజువు కావటంతో..అరెస్ట్ చేయక తప్పలేదు. ఇక, ఇదే రకమైన ఫిర్యాదులు ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మీద ఉన్నాయి. వైసీపీ నుండి వారి మీద పోటీ చేసి ఓడిన నేతలు వారి మీద కేసులు దాఖలు చేసారు. ఇప్పుడు చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి వ్యవహారంతో వీరి మీద ఉన్న ఫిర్యాదుల గురించి చర్చ మొదలైంది. వీరి మీద వచ్చిన ఫిర్యాదులు రాజకీయంగా చేసినవేనా..లేక నిజంగా ఆధారాలతో చేసారా అనే కోణంగా చర్చ ఆసక్తి కరంగా మారింది.
చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అరెస్ట్ ఎందుకంటే...
ఛతీస్ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక రాజకీయంగా పెద్ద కధ ఉంది. ఆయన 2013లో జరిగిన ఎన్నికల్లో మార్వాహీ నియోజకవర్గం నుండి పోటీ చేసారు. అమిత్ జోగి తాను పుట్టిన ప్రాంతానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారంటూ బీజేపీ అభ్యర్ధి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అమిత్ 1977లో టెక్సాస్లో జన్మించారని.. అఫిడవిట్లో మాత్రం చత్తీస్ ఘడ్ లోని సర్బేహెరా గౌరెలా గ్రామంలో 1978లో జన్మించినట్టు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని పైన బిలాస్ పూర్ పోలీసులు ఆరు నెలల విచారణ తరువాత అమిత్ జోగిని అరెస్ట్ చేసారు. దీనిని గమనించిన ఏపీలోని పొలిటికల్ లీడర్లు ఇప్పుడు 2049 ఎన్నికల తరువాత వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేల అఫిడవిట్ల పైన చేసిన ఫిర్యాదుల గురించి ప్రస్తావిస్తున్నారు. దాదాపు టీడీపీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేల పైన ఇటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు వారి విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారింది.
చిన రాజప్ప పైన తప్పుడు సమాచారం కేసు..
మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తాజా ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పైన పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి తోట వాణి ఒక కేసు దాఖలు చేసారు. చిన రాజప్ప తన అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించ కుండా తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మైనింగ్ కార్యాలయానికి వెళ్ళారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి, అక్కడి ఆస్తులు ద్వంసం చేశారని రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేశారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీచేసింది. ఇక, తన ఆదాయ వనరుల విషయంలోనూ రాజప్ప వాస్తవాలు దాచారనేది తోట వాణీ ఫిర్యాదు. అదే విధంగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీద ఫిర్యాదు ఉంది. బలరాం తన మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదని..భార్యతో పాటుగా కుమార్తె విషయాన్ని ఆయన ఉద్దేశ పూర్వకంగా దాచారని ఆయన మీద వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన ఆమంచి క్రిష్ణ మోహన్ ఫిర్యాదు చేసారు. కుమార్తె పదో తరగతి సర్టిఫికెట్ లోనూ తండ్రి పేరు కరణం బలరాం పేరు ఉంది. బలరాం తన అఫిడవిట్ లో వారి ఆస్తులు..ఆభరణాల విషయం చెప్పలేదన్నది ఆమంచి ఫిర్యాదు.
ఎంపీ గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ ... గోరంట్ల గట్స్ పై కామెంట్స్ .. వైరల్ గా మారిన వీడియో ..
మరో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పైనా...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరధర్ పైనా వైసీపీ అభ్యర్ధి చంద్రగిరి ఏసురత్నం ఫిర్యాదు చేసారు. గిరి అనేక బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మోసం చేసారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ లో దాచిపెట్టటం నేరమని.. ఆయన ఎన్నిక చెల్లదని వాదిస్తుననారు. అదే విధంగా నియోజకవర్గంలో మొత్తంగా 4040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వస్తే.. అందులో 312 మాత్రమే చెల్లినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. టీడర్ల డ్యూటీల విషయంలో ఏర్పడిన గందరగోళం ఈ పోస్టల్ బ్యాలెట్ వివాదానికి కారణమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినా..దాచినా వారి మీద చర్యలు తీసుకోవటానికి వీలుగా చట్టం స్పష్టంగా ఉందని ఫిర్యాదు దారులు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఇదే వ్యవహారంలో అరెస్ట్ కావటంతో ఏపీలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యేల పైన చర్చ మొదలైంది.