గుంటూరులో నకిలీ మద్యం కలకలం...చీప్ లిక్కర్ తాగి దంపతుల మృతి:వైద్యశాఖపై సీఎం సమీక్ష
గుంటూరు:జిల్లాలో మరోసారి నకిలీ మద్యం కలకలం రేపుతోంది. బాపట్ల మండలం యాజలీలో చీప్ లిక్కర్ తాగా దంపతులు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. గతంలో జిల్లాలో కల్తీ మద్యం కారణంగా మరణాలు చోటుచేసుకోవడంతో పాటు డెల్టాలో నకిలీ మద్యం తాలూకు భారీ డంప్ బయటపడిన ఘటన ప్రకంపనలు రేపింది.
ఈ నేపథ్యంలో తాజాగా చిలకజోస్యం చెప్పే అంజయ్య, మారమ్మ దంపతులు నిజాంపట్నంలో చీప్ లిక్కర్ సేవించి మృత్యువాతన పడటం మద్యపాన ప్రియులను ఉలిక్కిపడేలా చేసింది. మృతులు బాపట్ల మండలం నగరం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కల్తీ లిక్కర్ కారణంగానే చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో రేపల్లె మండలం తుమ్మల సమీపంలోని గాదెవారిపాలెంలోని ఓ నివాసంలో ఏడుగురు వ్యక్తులు కలసి కల్తీ మద్యం తయారీకి ఒడిగట్టిన ఘటన వెలుగు చూడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులు ఇందుకోసమే ప్రత్యేకంగా యంత్రాలు కొనుగోలు చేశారు. అప్పటికే 6వేల సీసాల మద్యం తయారుచేసి బయటకు పంపగా, మరో నాలుగువేల సీసాల మద్యం తయారికి ఉపయోగించే ముడిసరకు మాత్రం ఎక్సైజ్ అధికారులకు దొరికింది.
మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ లో ఉన్నతాధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించిన సిఎం చంద్రబాబు...డెంగీ జ్వరాలు పెరిగిపోతుంటే అధికారులు నిద్రపోతున్నారా?...అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా పరిస్థితిలో మార్పు రాకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను హాజరయ్యేలా చూశారు. ఈ సందర్భంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల విజృంభణపై సీఎం మండిపడ్డారు. డెంగ్యూ కేసులు పెరగడాన్నిసీఎం తీవ్రంగా పరిగణించారు. గతేడాది కంటే ఈసారి డెంగ్యూ కేసులు పెరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు . ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా అంటూ అధికారులను నిలదీసారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు కొత్తేమీ కాదని... అలాంటప్పుడు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సిఎం ప్రశ్నించారు.
శాఖకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వ్యాధులను ఎందుకు సమర్ధవంతంగా నియంత్రించలేకపోతున్నారని సిఎం ప్రశ్నించారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాలు ఎక్కడున్నాయి...ఇవి ఎక్కడ ఎక్కువగా ఎక్కడ ప్రబలుతున్నాయనే విషయంలో శ్రద్ద చూపించడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ ఏడాది మొదటి 25 వారాల్లోనే 1196 డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందని సిఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పరిస్థితి మరింత దిగజారకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు అధికారులకు రెండు రోజులు టార్గెట్ పెట్టారు. వ్యాధులు కంట్రోల్ కాకుంటే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదన్న సీఎం చంద్రబాబు సమస్య పరిష్కారం కాకుంటే తానే జ్వరపీడిత ప్రాంతాల్లో పర్యటిస్తానని హెచ్చరించారు.
మరోవైపు బసవతారకం మదర్ కిట్ల టెండర్ల విషయమై హై కోర్టు ఆదేశాలపైనా వైద్య ఆరోగ్యశాఖ ఇన్ ఛార్జ్ కమిషనర్ పూనం మాలకొండయ్యను వివరణ అడిగిన సిఎం ఈ సందర్భంగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మదర్ కిట్ల పంపిణీ నిలిచిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.