మాజీ ఏజీ దమ్మాలపాటిపై చీటింగ్ కేసు- ప్లాట్ పేరుతో మోసం- అడిగితే బెదిరింపులు
టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ను ఏపీ ప్రభుత్వం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆయనపై అమరావతి భూముల ఇన్సైడర్ కేసును నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కేసు నమోదు చేసింది. అమరావతి భూముల విషయంలో ఏసీబీ కేసుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో తాజాగా మంగళగిరి పోలీసులు ఆయనతో పాటు మరికొందరిపై నమోదు చేసిన చీటింగ్ కేసు కలకలం రేపుతోంది.
సీఆర్డీయే పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామ పరిధిలో లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రెండు ప్లాట్లను రిజిస్టర్ చేస్తానని చెప్పి కోడె రాజారామమోహన్రావు అనే రిటైర్డ్ లెక్చరర్ నుంచి దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రూ.75 లక్షలు తీసుకున్నట్లు మంగళగిరి పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. దమ్మాలపాటి శ్రీనివాస్ బావమరిది నన్నపనేని సీతారామరాజు ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. దమ్మాలపాటితో పాటు ఆయన భార్య నాగరాణి, కేవీజీ కృష్ణుడు, ఆయన భార్య ఆడుసుమిల్లి తనూజ, పొట్లూరు అనంతలక్ష్మి తదితరులను ఇందులో సహ నిందితులుగా చేర్చారు.
లేక్ వ్యూ అపార్ట్మెంట్ పక్కన స్ధలంలో స్టార్ హోటల్స్ వస్తున్నాయని, ఏజీ అయినందున తనకు ఈ విషయం ముందే తెలుసని చెప్పి తనతో ఫ్లాట్లు కొనుగోలు చేయించారని, రెండు ఫ్లాట్లకు డబ్బులు తీసుకుని ఒక్క ఫ్లాట్ రిజిస్టర్ చేశారని, అడిగితే బెదిరిస్తున్నారని రిటైర్డ్ లెక్చరర్ రాజారామ్మోహన్రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 120b, 420 / 406 / 506 / r/w34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.