కీచక గురువు అరెస్ట్:పాఠాలు చెప్పమంటే ప్రేమపాఠాలు చెప్పాడు.బాలికను పెళ్లి పేరుతో మోసం చేసి పారిపోయాడు
ఒంగోలు:అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరచాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ కీచక గురువులుగా పరిణమిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో వరుసగా వెలుగుచూస్తున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా మరో ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో మైనర్ అయిన విద్యార్థినిని ఏకంగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పడమే కాకుండా పెళ్లి పేరుతో దారుణంగా మోసగించాడు. కొన్ని రోజులు ఆ బాలికతో గడిపి ఆ తరువాత పత్తా లేకుండా పారిపోయాడు. ఆ తరువాత ఈ విషయం తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళితే...
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం చినరాయనిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న డి. భానుప్రకాశం అనే టీచర్ సింగరాకొండ మండలం పాకలకు చెందిన ఒక బాలికపై ప్రేమ వల విసిరాడు. ఆమెకు ఏవేవో మాయమాటలు చెప్పి నమ్మించి లోబరుచుకున్నాడు. ఆ తరువాత ఆ విద్యార్థిని పెళ్లి చేసుకోవాలని అడుగగా విజయవాడ తీసుకువెళ్లి ఒక ప్రార్థనా మందిరంలో ఉంగరాలు మార్చుకునే ప్రక్రియ నిర్వహించి పెళ్లి తంతు పూర్తయినట్లు నటించాడు.
ఆ తరువాత కొద్దిరోజుల పాటు ఆ బాలికతో కాపురం పేరిట ముచ్చట తీర్చుకున్న భానుప్రకాశం ఆ తర్వాత చెప్పాపెట్టకుండా పత్తాలేకుండా వెళ్లిపోయాడు. ఆమె భానుప్రకాశంకు ఫోన్ చేస్తుంటే స్విచ్చ్ డ్ ఆఫ్ వస్తుండటంతో ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. దీంతో వారు లబోదిబోమంటూ సింగరాయకొండ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విద్యార్థినిని మోసగించిన కీచక గురువు భానుప్రకాశంను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తదుపరి చర్యల గురించి తెలియకపోవడంతో భానుప్రకాశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఈఓ విచారించగా పాఠశాలకు భాను ప్రకాశం తొమ్మిదిరోజులు సెలవు పెట్టాడని, అది పూర్తయినా విధులకు హాజరు కావడంలేదని తెలుసుకున్నారు. అయినా అతడిపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని తెలిసి ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఈ విషయమై సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ ఎర్రగొండపాలెం ఎంఈవోకు లేఖ రాసిన డిఈవో...ఈ ఉపాధ్యాయుడిని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలపాలంటూ , సింగరాయకొండ పోలీసులకు సైతం లెటర్ రాశారు. ఆ వివరాలు అందగానే చట్టప్రకారం భానుప్రకాశంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఈవో తెలిపారు.