జనావాసాల్లో చిరుతల సంచారం ఆనవాళ్లు...భయాందోళనల్లో ప్రజలు
ఒంగోలు: అడవుల్లో ఆహారం దొరకడం లేదో ఏమో ఆ వన్య మృగాలు గ్రామాల బాటపట్టాయి. జనావాసాల్లో సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని నల్లమల, వెలుగొండ అడవుల నుంచి చిరుతలు గ్రామాల్లోకి వచ్చిన ఆనవాళ్లు కనిపిస్తుండటంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు.
ప్రకాశం, నెల్లూరు సరిహద్దు గ్రామాల్లో నీటికుంటల దగ్గర రెండు చిరుతలు సంచరించినట్లు వాటి అడుగు జాడలు స్పష్టంగా కనిపించడంతో జనం భీతిల్లుతున్నారు. దీనికి తోడు ఈ చిరుతల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఇక ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పొలాలకు, పనిపాటలకు వెళ్లాలంటేనే వెనుకాడుతున్నారు.
చిరుతలను చూశా...అంటున్న ఆర్టీసీ డ్రైవర్
తిమ్మారెడ్డిపాలెం గ్రామాల దగ్గర రోడ్డు దాటుతున్న రెండు చిరుతలను తాను చూశానని ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెబుతున్నాడు. తాను చిరుతలను ఎక్కడ చూసింది, అవి ఎలా ఉన్నది తదిదర వివరాలను గ్రామస్థులకు చెప్పాడు. దీంతో కాలిజాడలను బట్టి చిరుతలు తిరుగుతున్నాయని నమ్ముతున్న గ్రామస్థులు ఆర్టీసీ డ్రైవర్ చెప్పిన సమాచారంతో చిరుతల సంచారాన్ని నిర్థారించుకున్నారు.
ఆ తరువాత మేము చూశాం...తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులు...
తిమ్మారెడ్డిపాలెం శివారుల్లోని ముళ్లపొదల మధ్యలో తిరుగుతున్న చిరుత పులులనుతాము కూడా చూశామని ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తేల్చిచెబుతున్నారు. దీంతో ఇలా గ్రామ పరిసరాల్లోనే తిరుగుతున్న ఈ చిరుతలు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
మాకు సమాచారం ఇవ్వండి...రంగంలోకి ఫారెస్ట్ అధికారులు....
గ్రామస్థుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత పులులను ఎక్కడ చూసినా వెంటనే తమకు సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, గ్రామస్థులు భయపడవద్దని సూచిస్తున్నారు.
ముందుగా ఆనవాళ్లు కనబడిన చోట...చిరుతలకై అన్వేషణ
గ్రామస్థుల ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ముందుగా చిరుతలు సంచరించినట్లుగా చెబుతున్ననెల్లూరు జిల్లా వరికుంటపాడు, కృష్ణంపల్లి, తిమ్మారెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా, మోపాడు ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించారు. రెండు చిరుతలు సంచరించినట్లు నీటికుంట దగ్గర పాదముద్రలు కనిపించాయన్న చోట నిఘా పెట్టారు. అయితే చిరుతలు నీళ్లు తాగి అదేమార్గంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆనవాళ్లు కూడా అక్కడ ఉండటంతో మళ్లీ చిరుతలు అక్కడకు వస్తాయో రావో నిర్థారించలేకపోతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు రెండు జిల్లాల సరిహద్దుల గ్రామాల్లో చిరుతల కోసం జల్లెడ పడుతున్నారు. ఏదేమైనా చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో ఈ పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.