Vizag Gas Leakage: కెమికల్ గ్యాస్ లీకేజీ.. 8 మంది మృతి..? రోడ్డు పైనే కుప్పకూలుతున్న జనం..
ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైంది. చుట్టుపక్కల 3కి.మీ వరకు ఈ గ్యాస్ వ్యాపించడంతో.. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం.ఇందులో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
గ్యాస్ లీక్ సమాచారంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. గ్యాస్ ప్రభావానికి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. వారిిన అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తెల్లవారుజామున 4గంటలకు...
లాక్ డౌన్ పీరియడ్లో ఈ పరిశ్రమ మూతపడింది. తాజా సడలింపుల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 4గంటలకు పరిశ్రమను తెరిచారు. ఇదే సమయంలో పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైంది. అది గాల్లో 3కి.మీ మేర వ్యాప్తి చెందడంతో స్థానికులపై తీవ్ర ప్రభావం పడింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్యాస్ లీకేజీతో భయాందోళనకు,అస్వస్థతకు గురై.. తలుపులు మూసుకుని ఇళ్లల్లోనే ఉండిపోయారు.
8మంది మృతి.. ఇళ్లు ఖాళీ చేయిస్తున్న పోలీసులు
పోలీసులు సైరన్లు మోగించి ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాగా.. కొంతమంది విష వాయువు ప్రభావానికి తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డు మీదే పడిపోయారు. ఇందులో 8 మంది మృతి చెందినట్టు సమాాచారం.పరిశ్రమ ఉన్నచోటు నుంచి 5కి.మీ పరిధిలో అన్ని ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 25 అంబులెన్సులు ఏర్పాటు చేసి.. అస్వస్థతకు గురైనవారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ సైతం విష వాయువు ప్రభావానికి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం.
Recommended Video
సీఎం జగన్ ఆరా..
అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువగా చిన్నారులు,మహిళలు ఉన్నట్టు సమాచారం. లీకేజీని అరికట్టేందుకు స్థానిక అధికారులు,పరిశ్రమ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్చంద్,విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు మొదలుపెట్టాలని.. ప్రభుత్వం నుంచి ఏ అవసరమున్నా అందించడానికి సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.