టెక్కీ: వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు (పిక్చర్స్)
గుంటూరు: మధ్యాహ్నానికల్లా వస్తా, స్టేషన్కు వస్తానని చెప్పిన టిసిఎస్ టెక్కీ స్వాతి తానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. తమ కూతురు స్వాతి చెన్నైలో బాంబు పేలుళ్లలో మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ కటుంబం కలలే చెదిరిపోయాయి. రెండు నెలల క్రితం టిసిఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేరింది.
గుంటూరుకు చెందిన స్వాతి (22) బెంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా గురువారం ఉదయం బెంగుళూరు-గౌహతి ఎక్స్ప్రెస్లో సంభవించిన జంట పేలుళ్లకు బలైంది. అంతకుముందే ఆమెకు నిశ్చితార్థమైందని, మరో రెండు నెలల్లో పెళ్లి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణ వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.
బెంగుళూరులో ఆమె నివాసముంటున్న రామ్సాయి పీజీ హాస్టల్ నిర్వాహకులు అనంతరామిరెడ్డి ఆమె మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్లో టికెట్ దొరక్కపోతే గౌహతి ఎక్స్ప్రెస్లో తత్కాల్ ద్వారా స్వాతి టికెట్ బుక్ చేసుకుందని చెబుతూ స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆమె తండ్రి రామకృష్ణ స్వగ్రామం జాగర్లమూడిలో వ్యవసాయం చేస్తుండగా తల్లి కామాక్షి గుంటూరులో పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె తమ్ముడు ప్రద్యుమ్న ముంబైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు.
ఇంటికి రాకుండానే...
గురువారం మధ్యాహ్నానికల్లా గుంటూరులోని తమ ఇంటికి చేరుకోవాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వాతి ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
చెన్నై రైల్వే స్టేషన్లో అలజడి
బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైలు చెన్నై రైల్వే స్షేషన్లో ఆగి ఉన్నప్పుడు బాంబు పేలుళ్లు సంభవించాయి. దాంతో చెన్నై రైల్వే స్టేషన్లో అలజడి ప్రారంభమైంది
శోక సముద్రంలో కుటుంబ సభ్యులు
రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరి, మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోవాల్సిన కూతురు స్వాతి అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
తీసుకెళ్లాలని చెప్పి...
తాను మధ్యాహ్నానికల్లా రైల్వే స్టేషన్కు వచ్చి తనను తీసుకుని వెళ్లాలని తండ్రిని అడిగిన స్వాతి అక్కడికి రాకుండా చనిపోయింది.
ఘోరం ఇలా...
చెన్నైలో బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో బాంబు పేలడంతో గాయపడి ఓ ప్రయాణికుడు ఇలా కనిపించాడు.