సుజనా చౌదరికి ఈడీ షాక్- 12న హాజరుకావాలని చెన్నై కోర్టు సమన్లు- మనీలాండరింగ్ కేసులో
సుజనా గ్రూపు సంస్ధల అధినేత, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని బ్యాంకు రుణాల ఎగవేత కేసు వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ చురుగ్గా దర్యాప్తు సాగిస్తుండగా.. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడుగుపెట్టింది. బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ప్రశ్నించేందుకు ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని ఈడీ కేసులు విచారిస్తున్న చెన్నైలోని సెషన్స్ కోర్టు సుజనా చౌదరికి సమన్లు పంపింది. దీంతో అధికార పార్టీ ఎంపీకి చెన్నై కోర్టు నుంచి అందిన సమన్ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమమవుతోంది.
సుజనా చౌదరికి చెన్నై కోర్టు సమన్లు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిని బ్యాంకులకు రుణాల ఎగవేత కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆయనపై మనీలాండరింగ్ చట్టం కింద అభియోగాలు నమోదు చేసిన చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారిస్తున్న సెషన్స్ కోర్టు ఈ నెల 12న హాజరుకావాలని సమన్లు పంపింది. సుజనా చౌదరికి చెందిన పలు షెల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసుల్లో ఆయనపై దాఖలైన అభియోగాలపై విచారణ కోసం చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది.
బ్యాంకులకు రూ.5700 కోట్ల మోసం
వివిధ జాతీయ బ్యాంకులకు సుజనా గ్రూపు సంస్ధలకు చెందిన పలు కంపెనీలు రూ.5700 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్లోని సుజనా గ్రూప్ సంస్ధలపై దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా సుజనా గ్రూప్ పలు షెల్ కంపెనీల ద్వారా ఈ రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. వీటిని ఉద్దేశపూర్వకంగా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. దీంతో సుజనా చౌదరిపై మనీలాండరింగ్ చట్టం కింద అభియోగాలు నమోదు చేశాయి. వీటిపై విచారణలో భాగంగా చెన్నై కోర్టు సమన్లు ఇచ్చింది.
బ్యాంకులకు రుణాల ఎగవేత ఇలా
చెన్నైలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ పేరుతో సుజనాతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లు పలు బ్యాంకుల వద్ద భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాయి. తిరిగి వాటిని చెల్లించకపోవడంతో అనుమానమొచ్చిన బ్యాంకులు దర్యాప్తు సంస్ధలను ఆశ్రయించాయి. విచారణలో పలు బ్యా్ంకులకు సుజనాతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ డైరెకర్లు భారీగా మోసం చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపనీ ద్వారా తప్పుడు లెక్కలు చూపి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంక్ను రూ.71 కోట్లు, కార్పోరేషన్ బ్యాంక్ను రూ.159 కోట్లు మోసం చేశారు. వీటితో పాటు పలు బ్యాంకుల్లో షెల్ కంపెనీల ద్వారా మొత్తం రూ.5700 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సుజనాపై సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు
బెస్ట్ అండ్ క్రాంప్టన్ రుణాల ఎగవేత కేసులో బెంగళూరు సీబీఐ విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోని సుజనా ఆస్తులపై ఇప్పటికే దాడులు చేసిన ఈడీ.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే హైదరాబాద్ నాగార్జున హిల్స్లోని సుజనా కార్యాలయం నుంచి 126 కంపెనీలకు చెందిన రబ్బర్ స్టాంపులని స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా అభియోగాలు నమోదు చేసిన ఈడీ.. చెన్నై సెషన్స్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని విచారించిన కోర్టు.. తాజా సమన్లు ఇచ్చినట్లు సమాచారం.